ఆ వార్తలు చూసి ఆశ్చర్యపోయా, ఏపీలోనూ ప్రచారం చేస్తా: జయసుధ
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ నటి జయసుధ మంగళవారం మరోమారు స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారనే వార్తలను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తెలిపారు. అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోను ప్రచారం చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జయసుధ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం విలేకరులతో ఈ విషయం చెప్పారు.
కాగా, జయసుధ కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, తెరాసలో చేరుతారని కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భేటీ అయి ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసే విషయమై చర్చించనున్నారని ప్రచారం జరిగింది.
సాయంత్రం పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతలు జయసుధతో ఫోన్లో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె వివరణ ఇచ్చారు. మంగళవారం మరోమారు ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు చెప్పారు.