మర్కజ్ వెళ్ళిన వారి సర్వే ..ఆశా వర్కర్ మీద జులుం .. కౌన్సిలర్ అరెస్ట్
తెలంగాణలో కరోనా కేసులు పెరగటానికి మూలం అయిన ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ మీటింగ్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం ఆ పని చెయ్యటానికి ఆశా వర్కర్లను పురమాయించింది . ఇక ఇదే ఆశా వర్కర్ల పాలిట తలనొప్పిగా మారింది. ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్న సమయంలో ఆశా వర్కర్లకు సంబంధిత కుటుంబాల నుండి చేదు అనుభవం ఎదురవుతుంది
తెలంగాణా రాష్ట్రంలో జిల్లాల వారీగా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీఘీ జమాత్ సభకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అశావర్కర్లు .నిన్నటికి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మర్కజ్ మీటింగ్లకు హాజరైన వారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లకు బెదిరింపులు ఎదురయ్యాయి.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఓ ఆశా వర్కర్పై ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడ్డేందుకు ప్రయత్నించాడు. ఇక తాజాగా నిర్మల్ జిల్లాలో ఆశా కార్యకర్తలపై ఓ ముస్లిం కౌన్సిలర్ దురుసుగా ప్రవర్తించాడు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నిర్మల్ జిల్లా నుండి దాదాపు 52 మంది ఢిల్లీలో నిర్వహించిన మత ప్రచారసభలో పాల్గొని వచ్చారు. రెండ్రోజుల క్రితం అందులో ఒకరు ప్రాణాలు విడిచారు. ఈ నేపధ్యంలోనే ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించేందుకు ఆశా కార్యకర్తలు వెళ్లగా స్థానిక కౌన్సిలర్ అడ్డుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించేందుకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలను కబుతర్ కమాన్ కౌన్సిలర్ అడ్డుకుని తాము ఎలాంటి వివరాలు ఇవ్వమని ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలని బెదిరించారు. అంతే కాదు తాను కౌన్సిలర్ ను అని, అధికార జులుం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆయన వ్యవహార శైలిపై ఆశా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కావాలని ఆందోళన చేశారు .జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. చాలా చోట్ల ఆశా కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని, తమకు రక్షణ కల్పిస్తేనే సర్వేలకు వెళ్తామని ఆశ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక ఆయన వ్యవహార శైలిపై పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సిలర్ ను అరెస్టు చేశారు.