ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!
అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సరికొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 లో భాగంగా అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇచ్చినా, ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. ఇరు రాష్ట్రాల మధ్య పంచాయితీ మాత్రం ఇంకా తెగడం లేదు. తాజాగా నేడు మరోమారు ఉన్నతాధికారులు భేటీ అవుతున్నా సమస్య పరిష్కారం అవుతుందా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ గానే ఉంది.
బస్ భవన్ లో ఏపీ,తెలంగాణా ఉన్నతాధికారుల భేటీ .. అంతరాష్ట్ర రవాణాపై సీఎం కేసీఆర్ మెలిక.. ఉత్కంఠ !!
బస్సు సర్వీసుల విషయంలో ఏపీని ఇరకాటంలో పెడుతున్న తెలంగాణా
కేంద్రం ఇచ్చిన అన్ లాక్ 4.0 లో భాగంగా అన్ని రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య బస్సులు నడుస్తున్నాయి. కేవలం ఏపీ, తెలంగాణమధ్య బస్ సర్వీసుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీతో రవాణా విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒప్పందం చేసుకోలేదని, ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక బస్సు సర్వీసులు నడుస్తున్నాయని, ఎక్కువ కిలోమీటర్లు ఏపీ బస్సు సర్వీసులను నడిపిస్తుందని రకరకాల అంశాలను తెర మీదకు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ముందు కొన్ని ప్రతిపాదనలను ఉంచింది .
సర్వీసులను , కిలోమీతర్లను తగ్గించాలనే ప్రతిపాదన ... ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయానికి గండి
అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా బస్సులను నడపాలని, సమాన కిలోమీటర్లు ఇరు రాష్ట్రాలు తిప్పాలనే ప్రతిపాదనను తెర మీదికి తెచ్చింది. అయితే ఏపీ తరహాలో తెలంగాణ కూడా బస్సు సర్వీసులుపెంచుకోవటంలోనో , ఎక్కువ కిలోమీటర్లు తెలంగాణ బస్సు సర్వీసులు తిప్పడంలోనో ఏపీకి పెద్దగా ఇబ్బంది లేదు . కానీ తెలంగాణ రాష్ట్రం సర్వీసులను తగ్గించుకోవడం, తిరుగుతున్న కిలోమీటర్లు కూడా తగ్గించాలని చెప్పడం ఏపీకి ఇబ్బందికర పరిణామం. అంతేకాదు విజయవాడ , కర్నూలు వరకే బస్సు సర్వీసులను నడపాలని చెప్పటం కూడా ఇబ్బంది కర పరిణామం . అది ఏపీఎస్ ఆర్టీసీకి ఆదాయానికి గండి కొట్టటమే కాకుండా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది .
తెలంగాణా సర్కార్ మెలిక పెట్టటానికి కారణం ఆదాయమే
ఏపీ బస్సు సర్వీసులు, తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. దానివల్ల తెలంగాణ ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది అన్న అంశమే తెలంగాణ సర్కార్ ఈ మెలిక పెట్టడానికి ప్రధాన కారణం. ఇక నేడు మరోమారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. హైదరాబాద్లోని బస్ భవన్ లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయినప్పటికీ అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి ఉంది.
Recommended Video
నేడు కిలోమీటర్ల అంశంపై కీలక చర్చ .. చర్చలు ఫలిస్తాయా ?
ఏపీ తెలంగాణలో అదనంగా లక్షకుపైగా కిలోమీటర్లు బస్సులు నడిపిస్తోందని, ఆ కిలోమీటర్లను, బస్సు సర్వీసులను తగ్గించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీకి తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించింది . ఏపీ బస్సులు తగ్గించుకుని తెలంగాణ బస్సులు పెంచకపోతే తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, దీనివల్ల ప్రైవేట్ ట్రావెల్స్ లాభ పడతాయని ఒక వాదన ఉంది. ఏపీ బస్సులు తగ్గించుకునే విషయంలో తెలంగాణ ప్రతిపాదనకు సుముఖంగా లేకపోవడమే ప్రస్తుతం ఈ సస్పెన్స్ కి ప్రధాన కారణం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నేడు జరగనున్న భేటీలో ఏ రాష్ట్రం బస్సులు ఎన్ని కిలోమీటర్ల మేర తిప్పాలి అన్నదానిపై స్పష్టత రావాలి. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు రోడ్డు ఎక్కుతాయి అనేది స్పష్టత వస్తుంది.