టీఆర్ఎస్లోకి ఎంపీ గుత్తా: కండువా కప్పుకోకపోతే పార్టీ మారినట్లు కాదా?
హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి చేరిన నేతలు మెడలో కండువాలు వేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గులాబీ కండువా కప్పుకోకుండానే టీఆర్ఎస్లో చేరడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
దీంతో అసలు ఆయన టీఆర్ఎస్లో చేరారా? లేదా? అని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. కానీ ఆయన అలా చేయడానికి కారణం ఉందని అంటున్నారు. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నట్లయితే తనపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి.
అయితే తనపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఆయన రాజీనామా చేస్తే మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో వరుసగా ఉపఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవలే ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అక్కడ ప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన సంగతి తెలిసిందే. కనుక ఈ క్రమంలో మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లడం కంటే సరైన సమయంలో గుత్తా చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళడం మంచిదని కేసీఆర్ చెప్పడంతో గుత్తా తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కాగా, గుత్తాతో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలు సహా సీపీఐకి చెందిన రవీంద్రనాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పిన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు గుత్తా తన అనుచరులకు దగ్గరుండి మరీ కేసీఆర్తో పార్టీ కండువా కప్పించారు.
తాను మాత్రం కండువా వేసుకోలేదు. సీఎం కేసీఆర్ కూడా కండువా కప్పకపోయినప్పటికీ, ఆ సమయంలో వారి మధ్య ఉండటంతో ఆయన టీఆర్ఎస్లో చేరినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక వేదికపై నుంచి గుత్తా ఏమీ మాట్లాడలేదు.
మరోవైపు గుత్తూ సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అంతేకాదు గుత్తాపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు కూడా చర్యలు ప్రారంభినట్లుగా సమాచారం. అదే గనుక జరిగితే స్పీకర్ సుమిత్రా మహాజన్ సంజూయిషీ కోరుతూ నోటీస్ పంపిస్తుంది.
అంతేనా కాంగ్రెస్ అధిష్టానం తలుచుకొంటే గుత్తాపై అనర్హత వేటు వేయించడం కూడా పెద్ద కష్టమైనా పనేమీ కాదు. ఇదంతా జరగడం ఎందుకులే అనుకున్నాడో ఏమో గానీ గుత్తా టీఆర్ఎస్లో చేరినా చేరనట్లుగానే ఉన్నాడు.