మూడు రోజుల్లో పెళ్లి: ఇంతలోనే!.. తీవ్ర విషాదంలో ఆ కుటుంబం..
వివాహం చేసుకోవడం కోసం దుబాయి నుంచి కరీంనగర్ లోని స్వగ్రామానికి వచ్చిన యువకుడు.. అనూహ్యంగా శవమై తేలాడు.
కరీంనగర్: వివాహం చేసుకోవడం కోసం దుబాయి నుంచి కరీంనగర్ లోని స్వగ్రామానికి వచ్చిన యువకుడు.. అనూహ్యంగా శవమై తేలాడు. ఈ నెల 26న పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా రాయికల్ మండల కేంద్రానికి చెందిన కుర్మ రాము(25) నెల రోజుల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. మేనమామ కూతురితో పెళ్లి నిశ్చయమైనందునా.. ఏర్పాట్లలో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. అయితే పెళ్లి కార్డులు మరిన్ని ఆర్డర్ ఇస్తే బాగుండేదని రాము భావించాడు. గురువారం కుటుంబ సభ్యులతో మాట్లాడి మరిన్ని ఆర్డర్ కూడా ఇచ్చాడు. అదే రోజు ఇంటి నుంచి బయటకెళ్లిన రాము.. సాయంత్రమైనా మళ్లీ తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులంతా అతని కోసం గాలించగా.. గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద అతని బైక్, చెప్పులు కనిపించాయి. బావిలోకి చూడగా.. రాము అందులో శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఇలా శవమై కనిపించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.