విమాన టికెట్ బుక్ చేసుకున్నారని..: సైబరాబాద్, రాచకొండలోనూ పరిపూర్ణానంద బహిష్కరణ
హైదరాబాద్/కాకినాడ: ఇప్పటికే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన పోలీసులు.. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు మరోసారి షాకిచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పరిపూర్ణానందపై ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ నేపథ్యంలో గురువారం స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్ వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడ్నుంచి సైబరాబాద్ పరిధిలోకి వెళ్లాలని చూసినట్లు సమాచారం.
అయితే, ఈ విషయంపై సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు.. వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ స్వామి పరిపర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయల్దేరినట్లు తెలిసింది. కాగా, బుధవారం తెల్లవారుజామునే పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ పోలీసులు కాకినాడకు తరలించిన విషయం తెలిసిందే.