ఆసుపత్రి నుండి స్వామిగౌడ్ డిశ్చార్జ్: 'డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్: చట్ట సభల సభ్యులంతా ఆయా సభల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శాసననమండటి చైర్మెన్ స్వామి గౌడ్ అభిప్రాయపడ్డారు. డ్రామాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
సరోజిని కంటి ఆసుపత్రి నుండి గురువారం నాడు శాసనస మండలి చైర్మెన్ స్వామి గౌడ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలోనే ఆయన మీడియాతో మాట్లాడారు.
మూడు రోజుల క్రితం ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విసిరిన హెడ్ఫోన్ తగిలి శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం స్వామిగౌడ్ సరోజిని కంటి ఆసుపత్రిలో చేరారు.
మూడు రోజుల తర్వాత సరోజిని కంటి ఆసుపత్రి నుండి స్వామి గౌడ్ను గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. అయితే మరో మూడు రోజుల పాటు స్వామిగౌడ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
చట్ట సభల్లో సభ్యులు అనుసరించాల్సిన నియమాల ప్రకారంగానే నడుచుకోవాలని స్వామి గౌడ్ అభిప్రాయపడ్డారు. చట్ట సభల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వ్యక్తులను గౌరవించకపోయినా సరే, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని స్వామిగఃడ్ అభిప్రాయపడ్డారు.
తనకు సరోజిని కంటి ఆసుపత్రి వైద్యులు తనకు మెరుగైన చికిత్సను అందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను పరామర్శించిన అన్ని పార్టీలకు చెందిన నేతలకు స్వామిగౌడ్ ధన్యవాదాలు తెలిపారు .వాస్తవాలను ప్రజలకు చూపిన మీడియాకు కూడ స్వామిగౌడ్ ధన్యవాదాలు తెలిపారు.