బాబు గోగినేని వాళ్లకే ఆదర్శం, భావ ప్రకటన పేరుతో కించపరుస్తారా?: పరిపూర్ణానంద ఫైర్
హైదరాబాద్: హేతువాదిగా కొనసాగుతున్న బాబు గోగినేనిపై శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా మండిపడ్డారు. మతాల ఉనికిని దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్న స్వామి.. బాబు గోగినేని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భావ ప్రకటన పేరుతో కించపరుస్తారా?
గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణమని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు కులాలు, మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడంతో కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కులాల ప్రాతిపదికన చూడకూడదని కత్తి మహేష్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మతాల ఉనికి దెబ్బతీసేందుకే..
ఒక కులం తక్కువ కాదు, మరో కులం ఎక్కువ కాదని.. అన్ని కులాలు, మతాలు ఒకటేనని అన్నారు. అన్నిటికీ గౌరవం, మర్యాద, విలువలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మతాల ఉనికిని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు.
Recommended Video
గృహ నిర్బంధంలోనే పరిపూర్ణానంద
కాగా, స్వామి పరిపూర్ణానంద మంగళవారం కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. జూబ్లీహిల్స్లోని స్వామి బస చేసిన నివాసం నుంచి ఆయన్ని పోలీసులు బయటకు రానివ్వడం లేదు. ఆ ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్వామిజీ ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియాతోపాటు ఇతరులెవ్వరినీ అనుమతించడం లేదు.
బీజేపీ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు
స్వామిజీని కలిసేందుకు వచ్చిన వారందరినీ పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. స్వామిని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు లోనికి అనుమతించలేదు. పరిపూర్ణానందతో మాట్లాడి వెళతానని ఆయన కోరినప్పటికీ అంగీకరించలేదు.
హిందూ సంఘాల ఆగ్రహం
పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని రామచందర్ రావు మండిపడ్డారు. స్వామిజీని గృహ నిర్బంధం చేయడం సరికాదని అన్నారు. స్వామిజీకి కావాల్సిన న్యాయ సహాయం చేసేందుకు బీజేపీ తరపున సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, స్వామి చేపట్టిన యాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనుమతించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.