కేసీఆర్ నాకు సేవ చేశారు: రంగంలో అమ్మవారు, దత్తాత్రేయపై తలసాని
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని చెప్పింది.
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం వైభవంగా జరిగింది. పచ్చి కుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని తనలోకి ఆవాహన చేసుకుని భవిష్యవాణిని చెప్పింది.
తాను సంతోషంగానే ఉన్నానని, తనకు జరుగుతున్న పూజలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అమ్మ పలికింది. తన ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లేలా చూస్తానని, ఎటువంటి ఆపదా రానివ్వకుండా చూసుకుంటానని చెప్పింది.
మంచి వర్షాలు కురుస్తాయని, పంటలు బాగుంటాయని చెప్పింది. తనను బాగా చూసుకుంటున్న పాలకులపై తన కరుణ ఉంటుందని, తనకు పెట్టే వారికి అనారోగ్యం రానివ్వబోనని, ఒకరిని తక్కువగా, ఒకరిని ఎక్కువగా చూడనని, తక్కువ సేవ చేసినా, ఎక్కువ సేవ చేసినా, అందరూ తన బిడ్డలేనని అమ్మ పలికింది. తనకు జరిగే పూజల్లో కొంత లోటు కనిపిస్తోందని, అది మాత్రం అసంతృప్తిగా ఉందని చెప్పింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నాకు చాలా సేవ చేసారని, వారికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా చూస్తానని, కోట్లకు పడగలెత్తేలా చేస్తానని, తనకు సేవ చేసినా చేయకపోయినా అందరూ నా భక్తులేనని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా సమానంగా చూస్తానని అమ్మ పలికింది.
భక్తులకు కొన్ని ఇబ్బందులు
అమ్మవారి దేవాలయం ప్రాంగణం చిన్నదిగా ఉండటం, ఇరుకు సందుల కారణంగా అమ్మ దర్శనం కోసం తరలివచ్చిన అశేషమైన భక్తులకు కొన్ని ఇబ్బందులు కలిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అక్కడే నిలిపేశాం
భక్తులకు సౌకర్యంగా ఉండటం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ, రోడ్డుపై కూడా అసంఖ్యాక భక్తులు నడుస్తుండటంతో వాహనాల రాకపోకలను రాంగోపాల్ పేట సమీపంలోనే నిలిపివేసినట్లు తెలిపారు.
దత్తాత్రేయ అసంతృప్తి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తన సతీమణితో కలసి ఆలయానికి వచ్చిన సమయంలో ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా, ఆలయం వరకూ తన వాహనాన్ని అనుమతించలేదని దత్తాత్రేయ విమర్శించారు.
తలసాని స్పందన
దీనిపై తలసాని స్పందించారు. తాను తాను, ఎంపీ కేశవరావు, స్వామిగౌడ్ తదితరులమంతా చాలా దూరం నడిచే ఆలయానికి వచ్చామన్నారు.
రద్దీ సమయంలో వచ్చారని..
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రద్దీ సమయంలో వచ్చారని, ఆయనకు ఇబ్బందులు కలిగి ఉంటే ప్రభుత్వం తరఫున, దేవాలయం పక్షాన మన్నించాలని కోరుతున్నట్టు తెలిపారు.
కావాలని చేసింది కాదని..
ఇది కావాలని జరిగిన ఘటన కాదని తలసాని తెలిపారు. అన్ని పార్టీల వారూ అలాగే వచ్చారని, రద్దీ ఎక్కువగా ఉన్నందునే పోలీసులు ఎవరు వచ్చినా వారి వాహనాలను దూరంగానే నిలిపేశారన్నారు.