జగన్, కేసీఆర్ కోసం పూజలు .. ప్రతిఫలంగా శారదపీఠానికి నజారానా .. 2 రూపాయలకే రెండెకరాలు
హైదరాబాద్ : వడ్డించోడు మనోడైతే చాలు అనే సామెత శ్రీ శారదా పీఠానికి కరెక్టుగా సరిపోతుంది. అయితే ఇందులో శారదా పీఠం పాత్ర కోరడమే. గురువు స్థానంలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి .. తనకు తెలంగాణలో భూమి కేటాయించాలని అడిగారు .. అంతే సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద కేటాయించారు. తన గురుభక్తిని చాటుకొన్నారు.
యాగం యోగమా ..?
తెలంగాణ సీఎం కేసీఆర్కు యజ్ఞ, యాగాలంటే ఇంట్రెస్ట్. తన మనోవాంఛ ఫలం కోసం యజ్ఞాలు చేస్తుంటారు. సీఎం అయ్యాక కేసీఆర్ యాగాలు ఎక్కవయ్యాయి. కానీ ఎన్నికలకు ముందుచేసిన రాజశ్యామల యాగం మాత్రం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ యాగంతోనే కేసీఆర్ అధికారం చేపట్టారని వాదించేవారు కూడా ఉన్నారు. తర్వాత పక్క రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ కూడా రాజశ్యామల యాగం చేశారు. అయితే వీరిద్దరూ సీఎంలు కావడం విశేషం. దీంతో శారదపీఠానికి ఎక్కడలేని బలం వచ్చినట్టైంది. రెండురాష్ట్రాల సీఎంలు తమ చెప్పు చేతల్లో ఉన్నారని భావించి .. ఆ మేరకు గురుభక్తి ఇవ్వాలని అడిగింది.
తెలంగాణలో కూడా ..?
విశాఖపట్టణంలో శ్రీ శారద పీఠం నెలవైంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా తమ శాఖను ఏర్పాటుచేయాలని పీఠాధిపతి స్వరూప నంద్రేంద్ర స్వామి భావించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తమకు హైదరాబాద్లో భూమి కేటాయించాలని అందులో కోరారు. అయితే ఈ ఏడాది జూన్ 22న దరఖాస్తు చేశారు. అంతకుముందు 2018, 2015లో కూడా ప్రభుత్వానికి ఆప్లై చేశారు. తమ గురువు అడిగితే శిష్యుడు కాదంటారా ? స్వరూపానంద్రేంద్ర అడగడంతో కేసీఆర్ ఇవ్వలేనని చెప్పలేకపోయారు. రెండెకరాల భూమి ధారాదత్తం చేసేందుకు అంగీకరించారు.
రూ.24 కోట్ల భూమి ..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో రెండెకరాల 34 సెంట్ల భూమిని శారద పీఠానికి కేటాయించారు. ఇంతకీ ఎంతకు కేటాయించారో తెలుసా ... ఎకరం రూపాయి. అవును మీరు విన్నది నిజమే. ఇది కేసీఆర్ తన గురువుపై చూపించిన భక్తికి నిదర్శనం. రెండెకరాల భూమిని కేవలం రెండు రూపాయలకే అప్పనంగా కట్టబెట్టారు. మరి ఇక్కడ ఎకరాం భూమి ఎంత ఉందో తెలుసా .. అక్షరాల రూ.12 కోట్లు. అంటే దాదాపు రూ.24 కోట్ల పైచిలుకు డిమాండ్ చేసే భూమిని కేవలం 2 రూపాయలకు కట్టబెట్టి తన స్వామిభక్తిని ప్రదర్శించారు కేసీఆర్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 71ని జారీచేసింది.
విమర్శల వెల్లువ ....
ప్రభుత్వ భూమికి నామమాత్రపు ధర కేటాయించడంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్తిని స్వ ప్రయోజనాల కోసం ఏలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇది సరికాదని ప్రజాసంఘాల నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. యజ్ఞ, యాగాల కోసం కేసీఆర్ భూముల ధారాదత్తం చేయడం ఏంటని నిలదీస్తున్నారు.