కెసిఆర్ దమ్మున్న సీఎం, అగ్ని ప్రమాదం మంచిదే: స్వరూపానంద, ప్రమాదం (పిక్చర్స్)
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించడంపై శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అనంతరం స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. అయుత మహా చండీయాగం అద్బుతంగా జరిగిందన్నారు. ఈ అగ్నిప్రమాదం అరిష్టం కాదని, శుభ సూచకమన్నారు. అమ్మవారే సంతోషించి పూర్ణాహుతి చేసిందన్నారు. ఇది శుభసూచకం అన్నారు.
అయుత చండీ మహా యాగం పూర్తయిన తర్వాత పాకలను కాల్చివేయాలని శాస్త్రంలో ఉందని, మీకు గుర్తుందో లేదో భద్రాచలంలో అతిరాత్రి మహా యాగం జరిగిన తర్వాత అక్కడ పాకలను వాళ్లే కాల్చేశారన్నారు. కానీ ఇక్కడ అమ్మవారి పాదాల సాక్షిగా జరిగిందన్నారు.
శుభసూచకంగానే జరిగిందని, ఇది వైభవమైన కార్యక్రమమన్నారు. కెసిఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి అని స్వామీజీ కొనియాడారు. యజ్ఞయాగాదులు, క్రతువులు చేస్తే మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారన్నారు.
రైతులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు అందరూ సుఖంగా ఉండాలనే ఈ క్రతువు నిర్వహించారన్నారు. కేసీఆర్ చేసిన ఈ యాగంతో అమ్మవారు సంతోషించారని, రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది శుభసూచకమే అన్నారు. పూర్ణాహుతి జరిగిన వెంటనే అమ్మవారు అనుగ్రహించారన్నారు.
అగ్ని ప్రమాదం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో ఆదివారం నాడు స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది.
అగ్ని ప్రమాదం
విరామ సమయంలో యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. హోమగుండం నుంచి వచ్చిన అగ్నితో కుటీరానికి మంటలు అంటుకుని ప్రమాదం సంభవించింది.
అగ్ని ప్రమాదం
వెంటనే స్పందించిన ఫైరింజన్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం సంభవించిన వెంటనే యాగశాలలోని వారంతా బయటకు పరుగెత్తుకు వచ్చారు.
అగ్ని ప్రమాదం
యాగశాల పైకప్పు గడ్డితో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. యాగశాల వద్ద ఉన్న పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు సహాయచర్యలను పర్యవేక్షించారు.
అగ్ని ప్రమాదం
తుది రోజున సంపూర్ణ పూర్ణాహుతికి ముందు యాగశాల పైకప్పు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అయితే, యాగం విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఘోర దుర్ఘటన తప్పినట్లయింది.
అగ్ని ప్రమాదం
మరో గంటలో దేశ ప్రధమ పౌరుడు యాగానికి రానుండగా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. యాగ క్రతువులో భాగంగా ఉదయం నుంచి కిలోల కొద్దీ కర్పూరం, ఆవు నెయ్యిని 101 భారీ హోమగుండాల్లో వేసిన రుత్వికులు, విరామం కోసం లేచిన సమయంలో యాగ మండపంలోని ఓ హోమ గుండంలో మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదం
ఒక్కసారిగా లేచిన మంట పైకప్పుదాకా పాకి అంటుకుంది. పైకప్పును వరిగడ్డితో నిర్మించడంతో క్షణాల్లోనే మంటలు పాకాయి. పైనుండి మంటలంటుకున్న గడ్డి కిందపడ్డాయి. మంటలను ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు.
అగ్ని ప్రమాదం
ప్రమాదం సమయంలో... ఎక్కువమందిని రక్షించే దిశగా భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేసింది. అంతకుముందు వేసిన తాత్కాలిక గోడలను ధ్వంసం చేసి... రుత్వికులు, నిర్వాహకులు వేగంగా బయటకు వచ్చేలా చూశారు.
అగ్ని ప్రమాదం
ఈ క్రమంలో పలు తాత్కాలిక నిర్మాణాలను పీకేసి మార్గాలను ఏర్పాటు చేశారు. వాటిని పీకేశారు. కాగా, ఎవరీకి ప్రాణాపాయం జరగలేదు. అయితే, కొందరికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.