టెన్షన్.. టెన్షన్.. : స్వరూపానంద స్వామి హైదరాబాద్ టూర్!
హైదరాబాద్ : ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ హైదరాబాద్ టూర్ ఉద్రిక్తతలకు దారితీసేదిగా కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా, గత కొద్దిరోజులుగా షిర్డీ సాయిని టార్గెట్ గా చేసుకుని.. అసలు సాయిబాబా దేవుడే కాదంటూ స్వరూపానంద స్వామి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. స్వరూపానంద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న సాయి భక్తులు.. స్వరూపానంద దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అయితే స్వరూపానంద మాత్రం తన వివాదస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. పర్యటనలో భాగంగా.. నేటి సాయంత్రం హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో 'గురు వందనమ్' కార్యక్రమంలో స్వరూపానంద పాల్గొననున్నారు. స్వరూపానందను అడ్డుకుంటామని సాయి భక్తులు ప్రకటించిన నేపథ్యంలో.. లలిత కళా తోరణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ యంత్రాంగం.