తెలుగు వాళ్లు మరీ ఇంతగానా, భూతాన్ని పూజిస్తున్నారు: స్వరూపానంద
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా సాయి అనే భూతాన్ని పూజిస్తున్నారని, షిర్డిసాయి భూమిపై పుట్టారే తప్ప అవతరించిన వారు కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. సాయిని దేవుడిని చేసి హిందువులను మూర్ఖులను చేయవద్దని అన్నారు. సాయిని దత్తాత్రేయ, కృష్ణుడు, రాముడు, విష్ణువు రూపాల్లో కొలుస్తున్నారని గుర్తు చేస్తూ అది తప్పు అని అన్నారు.
సీతారాం బదులు సాయిరాం అని ఎందుకు అంటున్నారో వారే ఆలోచించుకోవాలని స్వరూపానంద వాఖ్యానించారు. సంతోషిమాత వచ్చింది.. వినాయకుడు పాలు తాగాడు అంటూ సనాతన ధర్మం పరువు తీయవద్దన్నారు. జిహాద్ పేరిట పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు దేశమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాదులోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లలితకళాతోరణంలో దర్శనం పత్రిక పుష్కరోత్సవం సందర్భంగా స్వరూపానంద గురువందనం చేశారు. సనాతన ధర్మమే హిందూత్వమని అన్నారు. ఎదుటి వారి ఆకలిని తీర్చి, ప్రతిప్రాణిలో పరమాత్మను చూసేవాడే హిందువు అని అన్నారు. హిందూదేశంలో పుట్టిన వారందరూ హిందువులని కొత్త వ్యాఖ్యలు వస్తున్నాయని, అవి అవాస్తవమని అన్నారు.
వేదాలను పఠించి, గోమాతను పూజించి, గోదావరి, కృష్ణలను పూజించేవారే హిందువులని అన్నారు. భారతదేశంలో మహిళలను పూజించే సంస్కృతి ఉండేదని, అయితే ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం మద్యం సేవించడమేనన్నారు.
సాయిబాబా దేవుడు కాదని ఇక్కడ కాదు.. షిర్డీలో సాయి సంస్థాన్ సభ్యులకే సవాల్ విసిరామని, రెండునెలలు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదని అమృతానంద స్వామి అన్నారు. సభ అనంతరం 'సాయిని కొలవం, కొలిచిన వారితో కలవం' అంటూ ప్రతిజ్ఞ చేశారు.
కాగా స్వరూపానంద స్వామి సాయి గురించి మాట్లాడుతుండగా సభలో ఉన్న సాయి భక్తులు ఒక్కసారిగా నిలబడి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
సాయిపై ఆపని స్వరూపానంద
షిర్డీ సాయిబాబా దేవుడు కాడని, తెలుగు రాష్ట్రాల్లో సాయి పేరు మీద భూతాన్ని పూజిస్తున్నారని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద విమర్శించారు. ఆయన హైదరాబాదులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల భక్తులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
గత కొద్ది రోజులుగా ఇదే తీరు...
షిర్డీ సాయిబాబా విషయంలో స్వరూపానంద గత కొద్ది రోజులుగా తన విమర్శలను ఎక్కుపెడుతూ వచ్చారు. ఆయన విమర్శలపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగడం లేదు. చాంద్ మియాను సాయిగా పూజిస్తున్నారని, అది సరి కాదని ఆయన అంటూ వస్తున్నారు.
షిర్డీలో సుదర్శన చక్రం ప్రతిష్టిస్తాం...
త్వరలోనే షిర్టీలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించబోతున్నామని స్వరూపానంద ప్రకటించారు. మరుమాముల వెంకటరమణ శర్మ సంపాదకత్వంతో వెలువడుతున్న ‘దర్శనమ్' ఆధ్యాత్మిక మాసపత్రిక పుష్కరోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హైదరాబాద్లోని తెలుగు లలితకళాతోరణంలో స్వరూపానంద స్వామికి ‘గురువందనమ్' కార్యక్రమం నిర్వహించారు.
వారే ముస్లిమని అంగీకరించారు...
సాయిబాబా హిందువు అని నిరూపించాలని గత రెండు నెలల క్రితం సాయి సంస్థానం వారికి సవాలు విసిరినా వారు నిరూపించలేకపోయారని స్వరూపానంద అన్నారు. షిర్టీ సంస్థానం ప్రచురించిన సాయి సత్చరిత్ గ్రంథంలోనే సాయిబాబా జన్మతః ముస్లిం అని స్వయంగా అంగీకరించారని అంటూీ అటువంటప్పుడు సాయిబాబా హిందువుల ఆరాధ్యుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
వాటిని అధ్యయనం చేయలేదు...
షిర్టీ సాయిబాబా ఎటువంటి వేదోపనిషత్తులు, ధార్మిక సిద్ధాంతాలను అధ్యయనం చేయలేదని, ఆచార నియమాలు పాటించలేదని, మానవుడిగా జీవించాడని స్వరూపానంద అన్నారు. అందుకే సాయిబాబాను దేవతగా పూజించడం, ఆయన పేరు మీద అభిషేకాలు, అర్చనలు చేయడం హైందవ సిద్ధాంతానికి విరుద్ధమని అన్నారు. అయితే, హిందూ ధార్మిక సిద్ధాంత ప్రకారం దైవత్వం అనేది ప్రతిజీవిలోనూ ఉందని అభిప్రాయపడ్డారు.
దైవశక్తి అప్పుడు ఉండవచ్చు...
సాయిబాబా జీవించినంత కాలం ఆయనలో పరమాత్ముడు ఉండవచ్చునని, ఇప్పుడాయన భౌతికంగా లేనప్పుడు దేవుడిగా పూజించడం ఒక భూతాన్ని, దెయ్యాన్ని పూజించడంతో సమానమని స్వరూపానంద అన్నారు. సాయిబాబాకు నిజంగానే శక్తి ఉండుంటే రాముడి పేరును ఎందుకు వాడుకుంటున్నారని స్వరూపానంద స్వామి ప్రశ్నించారు.
సభలో సాయి భక్తుల నిరసన
స్వరూపానంద స్వామి సాయి గురించి మాట్లాడుతుండగా సభలో ఉన్న సాయి భక్తులు ఒక్కసారిగా నిలబడి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. హైదరాబాదులో స్వరూపానందకు వ్యతిరేకంగా సోమవారం కూడా ఆందోళనలు కొనసాగాయి.