చంద్రబాబుకు సన్నిహితుడి భారీ షాక్, కాంగ్రెస్లోకి నామా: కేటీఆర్ ద్వారా లాబీయింగ్, నో చెప్పిన కేసీఆర్
Recommended Video
హైదరాబాద్/ఖమ్మం: తెలుగదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుసగా షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆరుగురు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలో చేరుతున్నారు.
రాజమండ్రి నుంచి చెబుతున్నా.. పోటీ చేస్తా: తెలంగాణపై పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు
వీరందరి విషయం పక్కన పెడితే తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆయన కోటరీలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కీలక నేత, టీడీపీకి ఎన్నో విధాలుగా సాయం అందించిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీకి నామా గుడ్ బై?
నామా నాగేశ్వర రావు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు కూడా. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు చెబుతున్నారట. ఆయన గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. చంద్రబాబుకు సన్నిహితుడైన నామా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఇటీవలే చంద్రబాబును కలిసి వెళ్లారట.
టీఆర్ఎస్ వద్దంటే కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
కాగా, నామా నాగేశ్వర రావు తెరాసలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నో చెప్పాకనే కాంగ్రెస్ వైపు చూస్తున్నారా.. అంటే పరిణామాలు చూస్తే కావొచ్చునని అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి ఒకరు తెరాసలో చేరి ఖమ్మం లేదా హైదరాబాదులోని మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారని, కానీ ఆయన రాకను కేసీఆర్ నిరాకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మాజీ ఎంపీ నామానే కావొచ్చునని అంటున్నారు.
నో చెప్పిన కేసీఆర్
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఓ పార్టీలో కీలక పదవిలో ఉన్నారని, ఆయన ఎంపీ టికెట్ కోసం తెరాస తీర్థం తీసుకోవాలనుకున్నారని, ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆయన పార్టీ ముఖ్య సమావేశానికి కూడా వెళ్లకుండా హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారని, తాను తెరాసలో చేరతానని, ఖమ్మం లేదా మల్కాజిగిరి టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని ఆయనకు చెప్పారని, తన సొంత బలంతోనే గెలిచే సత్తా ఉందని వివరించారని, కేటీఆర్ ఆ మాజీ ఎంపీ ప్రతిపాదనను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లగా, పార్టీలో సమర్థులు ఉన్నారని, ఆయన వద్దని చెప్పారని, ఆయన అవసరం లేదని చెప్పేశారని, ఆయనను చేర్చుకుంటే సమస్యలు వస్తాయని కేటీఆర్తో కేసీఆర్ చెప్పారని, ఇదే విషయం ఆ మాజీ ఎంపీకి కేటీఆర్ చెప్పారని అంటున్నారు. ఇక్కడ ఆ మాజీ ఎంపీ నామానే అని స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు.