రాజ్భవన్లో ‘గవర్నర్ ఎట్ హోమ్’, బహిష్కరణకు టీ కాంగ్రెస్ నిర్ణయం, వద్దన్నా వెళ్లిన ఇద్దరు నేతలు!
రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగే ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని బహిష్కరించాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయినా సరే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఎట్హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, హరీశ్ రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీలు వినోద్, దత్తాత్రేయ కూడా ఈ తేనీటి విందుకు హాజరయ్యారు.
మరోవైపు రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగే 'గవర్నర్ ఎట్ హోమ్' కార్యక్రమాన్ని బహిష్కరించాలని టీ-కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయినా సరే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం కలకలం రేపుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ పై విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ టీ-కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 'గవర్నర్ ఎట్ హోమ్'కు హాజరు కాకూడదని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అయితే, ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, రాపోలు ఆనందభాస్కర్ లు 'గవర్నర్ ఎట్ హోమ్' కార్యక్రమానికి హాజరై గవర్నర్తో కరచాలనం చేయడం టీ-కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
ఈ విషయమై రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. ఇక ఈ విషయమై దానం నాగేందర్ స్పందించాల్సి ఉంది.