'తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన జేసీ పని చూసుకోక.. మాపై కామెంట్ చేస్తారా'
జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి తన పనుల తాను చూసుకొని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్లు చేయడం ఏమిటని టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి తన పనుల తాను చూసుకొని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్లు చేయడం ఏమిటని టి కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
అసెంబ్లీకి పనుల కోసం వచ్చిన జేసీ వచ్చిన పని చూసుకోకుండా తమ పార్టీ పైన కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఆయన తమ పార్టీ వ్యక్తి కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఆయనకు తమ పార్టీతో పని ఏముందన్నారు.
వేరే పార్టీలో చేరడమా: జేసీ దివాకర్ ఆసక్తికరం: డొనాల్డ్ ట్రంప్-కేసీఆర్ ఒక్కటే!
బట్ట కాల్చి మీద వేస్తారా అని నిలదీశారు. ఆయనకు మర్యాద ఏమైనా ఉందా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి అందులోనే బతుకుతున్న వాళ్లమని, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిపోతే కడుపు కాలిపోతోందన్నారు.
కాగా, రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుకోకుండా అన్యాయం చేశారని, అడవుల పాలు చేశారని, విభజన తర్వాత తాము తెలంగాణతో కలిసి ఉంటే, తాగటానికి ఇన్ని నీళ్లు, తినటానికి ఇంత తిండి దొరికేదని, కానీ కుదరలేదని, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ రెడ్లే అడ్డుపడ్డారని జేసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో కష్టమేనని తాను అప్పుడే చెప్పానని కూడా అన్నారు.