తెరాసలోకి వెళ్తున్నాం, సోనియాని మరవం: గుత్తా, వివేక్, ఏడ్చిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలనుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు మూకుమ్మడిగా అధికార తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వారు ఈ నెల 15వ తేదీన కారు ఎక్కాలని నిర్ణయించారు.
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే భాస్కర రావు, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తదితరులు తెరాసలో చేరనున్నారు. అదే రోజు సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కూడా తెరాసలో చేరనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులోని కేసీఆర్ పాంహౌస్కు ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర రావు వెళ్లారు. ఈ సమయంలో కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపిన అనంతరం కారు ఎక్కాలని నిర్ణయించారు.
దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి తనయులిద్దరు వినోద్, వివేక్లు కూడా తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కేందుకు ముహూర్తం ఖరారైంది.
వీరితో పాటు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్, ఏపీఐఐసీ మాజీ సభ్యుడు జువ్వాడి నర్సింగరావు కూడా పార్టీలో చేరనున్నారు. దివంగత వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ట్యాంక్బండ్ మీద ప్రధాన స్థలాన్ని కేటాయించారు. ఆనాటినుంచే వివేక్, వినోద్ సీఎం కేసీఆర్కు మరింత దగ్గరయ్యారని అంటున్నారు.
మాజీ ఎంపీ వివేక్తోపాటు మాజీ మంత్రి వినోద్ తెరాసలో చేరుతున్నారన్న ప్రచారం కాంగ్రెస్లో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరితో ఆదివారం చర్చలు జరిపారు. మారేడ్పల్లిలోని మాజీ మంత్రి వినోద్ ఇంటికి వెళ్లి పార్టీని వీడొద్దని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి, ఈ నెల 11న ఢిల్లీకి రావాల్సిందిగా వివేక్, వినోద్లకు రాహుల్ గాంధీ వర్తమానం పంపించారు. ఢిల్లీ వెళ్లాలనే తొలుత వారిద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆ ఉద్దేశ్యాన్ని విరమించుకుని హైదరాబాద్లో పార్టీ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, జానారెడ్డిలను కలిసి మాట్లాడారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా, పార్టీని వీడవద్దని వివేక్, వినోద్కు జైపాల్ రెడ్డి, జానా రెడ్డి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, పార్టీలో తమకు గుర్తింపే లేకుండా పోయిందని, తమ నియోజవర్గంలో సీనియర్ నాయకులే గ్రూపులను ప్రోత్సహిస్తూ తమను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి డి శ్రీధర్ బాబు, ఆయన వర్గీయులపై ఫిర్యాదు చేశారని వార్తలు వస్తున్నాయి.
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఓడిపోతానని తెలిసినా, పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశానని, అయినా తనకు ఏమాత్రం గుర్తింపు లేకుండా పోయిందని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ తాము కాంగ్రె్సలోనే కొనసాగితే వచ్చేదేమీ లేదని, పార్టీలో ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోక తప్పదని చెబుతూ.. తాము పార్టీని వీడుతున్నామని చెప్పారని తెలుస్తోంది.
అందుకే తెరాసలో చేరుతున్నాం: గుత్తా, వివేక్
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తాము తెరాసలో చేరుతున్నామని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేక్ సోమవారం నాడు విలేకరులకు తెలిపారు. రెండు పర్యాయాలు ఎంపీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుత్తా ధన్యవాదాలు తెలిపారు.
జానారెడ్డి నిండుకుండలాంటి వారని, అలాంటి వ్యక్తి సూచటనలు తమ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయన్నారు. జానారెడ్డికి తాము కుడిభుజం లాంటివారమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతకలహాలు ఉన్నాయని, అది తమను మనోవేదనకు గురి చేసిందన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్కు సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం అనేక ప్రయత్నాలు చేశామని, రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోలేమని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. అందుకే తెరాసలో చేరుతున్నట్లు చెప్పారు.
గుత్తా, వివేక్, మాజీ మంత్రి వినోద్లు సోమాజీగూడలోని వివేక్ నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్కు సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని చెప్పారు.
ఎమ్మెల్యే భాస్కర రావు కంటతడి
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడితున్న సందర్భంగా గుత్తా, వివేక్, భాస్కర రావులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన భాస్కర రావు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కంట నీరు కనిపించింది. మరో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు.