దేవేందర్ గౌడ్ తో టీ కాంగ్రెస్ మంతనాలు..! ఎటూ తేల్చుకోని టీడిపి ఎంపీ..!!
హైదరాబాద్ : సుధీర్గ రాజకీయ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలలోని సీనియర్ రాజకీయ నేతలను తన వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉన్నతెలుగుదేశం పార్టీకి మరింత షాక్ తగిలేలా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే ముఖ్యనేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి, ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న బీజేపీలో చేరిపోగా, మిగిలిన కొందరు నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే టీడీపీ లో మిగిలి ఉన్న మరికొద్ది మంది ముఖ్యనేతలు పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంలో నెంబర్2గా ఓ వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆయనను కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆహ్వానిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీని వీడిన దేవేందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు. ఆ తరువాత దానిని పీఆర్పీలో విలీనం చేశారు. తరువాత తెలుగుదేశంలో చేరి రాజ్యసభ పదవిని అందుకున్నారు దేవేందర్ గౌడ్.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్ కు పార్టీలో తగిన స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యనేతగా గుర్తించారు. కాగా తన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో దేవేందర్ గౌడ్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. దీంతో పాటుగా రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం అంచున నిలబడగలిగింది. ఇలా అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ వైపు దేవేందర్ గౌడ్ మొగ్గు చూపారని తారా స్థాయిలో ప్రచారం జరిగింది.
అనూహ్య రీతిలో దేవేందర్ గౌడ్ తో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపినట్టు చర్చ జరుగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దేవేందర్ గౌడ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సహజంగానే వారిద్దరి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీలో దేవేందర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారట విక్రమార్క. అయితే పార్టీ మారే అంశంలో ఇంకా తిది నిర్ణయం తీసుకోలేదని, రాజకీయ భవిష్యత్ నిర్థారించుకునేందుకు మరింత సమయం కావాలన్నట్టు దేవేందర్ గౌడ్ వివరించినట్టు తెలుస్తోంది.