'25 లక్షలు అంటే 5 లక్షలు రాలేదు, కేసీఆర్! చంద్రబాబు వల్లేనని మరవొద్దు'
హైదరాబాద్: తెలంగాణ యువత నైరాశ్యంలో ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, కానీ నిరుద్యోగులకు మాత్రం రాలేదన్నారు. జోన్లలో 95 శాతం స్థానికులకో వస్తాయని, సాధించినది ఏమిటో చెప్పాలని నిలదీశారు. స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనలో కేసీఆర్ విఫలమయ్యారని చెప్పారు.
నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందంటే?
టీఎస్పీఎస్సీలో 19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఐటీఐఆర్ ఏమైందో కేసీఆర్, కేటీఆర్లు చెప్పాలని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు పోలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఇప్పుడు కూడా అన్నే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
Recommended Video
కేసీఆర్, గవర్నర్ అదే చెప్పారు
తెలంగాణ వస్తే 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని, 2014, 2015 అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగాల్లో గవర్నర్ అదే చెప్పారని ఉత్తమ్ గుర్తు చేసారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఆ ప్రసంగాలను మీడియాకు ప్రదర్శించారు. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిసారి కొత్త లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారన్నారు.
25 లక్షలమంది అని చెబితే, 5 లక్షలు రాలేదు
ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మండిపడ్డారు. 25 లక్షల ప్రజలు వస్తారని సీఎం ప్రకటిస్తే కనీసం 5 లక్షలమంది రాలేదన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. దురుద్దేశంతో మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
చంద్రబాబు వల్లే వచ్చిందని కేసీఆర్ మరిచిపోవద్దు
కేసీఆర్ పాలన కొంతమంది వ్యక్తుల అధీనంలోనే నడుస్తోందని రమణ ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట రూ.లక్షల కోట్లు వృథా చేస్తున్నారన్నారు. కేసీఆర్ తలపెట్టిన ప్రగతినివేదిక సభ ప్రగతి వేదన సభగా మారిందన్నారు. కేసీఆర్ సభ అవినీతి అక్రమాలకు నిదర్శనమని మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫొటోలు, ప్రకటనలు మాత్రమే కనిపించాయన్నారు. చంద్రబాబు వల్లే కేసీఆర్కి మంత్రి పదవి వచ్చిందన్న విషయం మర్చిపోవద్దన్నారు.