'ఖరీదైన' చైనా టూర్ లెక్క చెప్పు: యాష్కీ, అందుకే ప్రపంచ బ్యాంక్ 13వ ర్యాంక్: షబ్బీర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చైనాకు వెళ్లి రాష్ట్రానికి ఏం తె్చచారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు.
అలాగే గతంలో సింగపూర్ పర్యటన, ఇప్పుడు చైనా పర్యటనకు ఎంత ఖర్చు చేశారో, ఆ పర్యటనల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన మేలు ఎంతో చెప్పాలన్నారు. ప్రజా ధనంతో విదేశీ పర్యటనలకు వెళ్లడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు అధికారికంగా జరపడం లేదో కేసీఆర్ ప్రజలకు వెల్లడించాలన్నారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవం జరపడం లేదంటూ ముఖ్యమంత్రులను విమర్శించిన కేసీఆర్ అధికారంలో ఉండి కూడా విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదన్నారు.
అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు: షబ్బీర్ అలీ
విభజన సమయంలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఒక్క ఏడాదిలో కెసిఆర్ 63వేల కోట్ల అప్పులు చేశారన్నారు. చిన్న పరిశ్రమలకు 12వందల కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలన్నారు.
కేసీఆర్ తీరు నీరో చక్రవర్తిలా ఉందన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టుగా, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు. అందుకే ప్రపంచ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన రాష్ట్రాల్లో 13వ ర్యాంకు ఇచ్చిందన్నారు. తాజా చైనా పర్యటన, గత సింగపూర్ పర్యటన ద్వారా కేసీఆర్ తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
ఖరీదైన చార్టర్డ్ విమానంలో...
చైనా పర్యటన పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. చైనా పర్యటన ద్వారా కెసిఆర్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. అత్యంత ఖరీదైన చార్టర్డ్ విమానంలో పదిరోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లటం దేశంలో ఇదే తొలిసారి అన్నారు. ఆ మొత్తాన్ని రైతు సంక్షేమానికి ఖర్చు చేస్తే ఆత్మహత్యలు అయినా ఆగేవన్నారు.
కెసిఆర్ చైనా పర్యటనతో ఒరిగిందేమీ లేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భూసేకరణ పైన కేంద్రం వెనక్కి తగ్గడం ప్రజా విజయమన్నారు. ఈ నెల 20న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.