జేఏసీ ఉంటుంది, 'తెలంగాణ'లో అన్ని పార్టీల పాత్ర: కోదండ, కెసిఆర్కు చురకలా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చురకలే కావొచ్చునని అంటున్నారు. ఆయన ఆదివారం హరగోపాల్ తదితరులతో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. తెలంగాణ అంశంలో తమ ఉద్యమానికి విరామం మాత్రమేనని, విరమణ మాత్రం కాదని చెప్పారు. తెలంగాణ బిల్లు విషయంలో కెసిఆర్తో పాటు అన్ని పార్టీలు కీలక పాత్ర పోషించాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కొనసాగుతుందని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కంకణబద్దులం అవుదామన్నారు.
తెలంగాణ స్వప్నం సాధించే వరకు తెలంగాణ జేఏసి కొనసాగాలని హరగోపాల్ అన్నారు. ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్ కమిటీ ఫెయిల్ అయిందని దేవీప్రసాద్ మండిపడ్డారు. ఉద్యోగుల విభజనలో ఆంధ్రా పెత్తనం ఉందన్నారు.
జేపీని ఆదర్శంగా తీసుకోవాలి: దత్తాత్రేయ
జయప్రకాశ్ నారాయణ్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆదివారం అన్నారు. జయప్రకాశ్ నారాయణ్ 113 జయంతి సందర్భంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. జయప్రకాశ్ నారాయణ్ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పైనా మండిపడ్డారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సాగిన తీరు పైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరిగిన తీరు బాధాకరమన్నారు. మరోనేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిన మహోన్నత వ్యక్తి జయప్రకాశ్ నారాయణ్ అని కీర్తించారు.