'కోమటోళ్లపై కేసీఆర్ను అడగండి?, తప్పంటాడా.. భాషను అవమానించినట్లే'
ఒకవేళ ఈ పదాన్ని తీసేయాలని గనుక పట్టుబడితే అది తెలంగాణ భాషను అవమానించేనట్లే అవుతుందన్నారు.
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురైన ఈ పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్ ఆ వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఐలయ్యకు బెదిరింపులు కూడా పెరిగినట్లు తెలుస్తోంది.
ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీ-మాస్ ఫోరం) ఐలయ్యకు మద్దతు పలికింది. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీమాస్ ఫోరం నేతలు గద్దర్, తమ్మినేని వీరభధ్రం, కాకిమాధవరావులు కంచ ఐలయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.
Recommended Video
'సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై భగ్గుమన్న వైశ్యులు: ఎవరినీ విమర్శించలేదన్న ఐలయ్య..
తెలంగాణ భాషను అవమానించడమే:
కోమటోళ్లు అనే పదంతో వైశ్యులను అవమానించారన్న వాదనను కంచ ఐలయ్య తప్పుపట్టారు. తెలంగాణలో ఆ సామాజిక వర్గాన్ని కోమటోళ్లు అనే పిలుస్తారని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అదే పదం వాడుతారని చెప్పారు. ఒకవేళ ఈ పదాన్ని తీసేయాలని గనుక పట్టుబడితే అది తెలంగాణ భాషను అవమానించేనట్లే అవుతుందన్నారు.
కేసీఆర్ను అడగండి?:
వైశ్యులు అని చెప్పుకుంటున్నవారిని తెలంగాణలో కోమటోళ్లు అని పిలుస్తారా? లేదా? అన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు సీఎం కేసీఆర్ను అడిగి తెలుసుకోవాలన్నారు. నిజానికి ఆర్యవైశ్య అన్న పదమే సరైంది కాదని, ఈ ప్రాంతం ద్రవిడ మూలాలు కలిగి ఉన్నదన్న విషయం మరిచిపోవద్దని అన్నారు.
తన సిద్దాంతాల పైన అభ్యంతరాలు ఉంటే కౌంటర్ థియరీ ఇవ్వాలని, అంతే తప్ప రోడ్ల మీదకు వచ్చి తన దిష్టిబొమ్మలు తగలబెట్టడం సబబు కాదని ఐలయ్య అన్నారు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కుకు రచనలు ప్రతిరూపం అని అన్నారు.
వాళ్లిచ్చే డొనేషన్ల కోసమే:
రాష్ట్రంలో ఆర్య వైశ్యులు దిష్టిబొమ్మల్ని కాదు, ప్రజాస్వామ్యాన్ని తగలబెతున్నారని కంచ ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సామాజిక వర్గం నిర్వహించే వ్యాపారాల నుంచి రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున డొనేషన్లు ముడుతున్నాయని, అందువల్లే ప్రభుత్వాలు వారి మీద చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆర్య వైశ్యులు ఇకనైనా తమ పద్దతి మార్చుకోకపోతే.. వారి దుకాణాల్లో కొనుగోళ్లు చేయవద్దని పిలుపునిస్తామన్నారు.
అలా అంటే కరెక్టా?: గద్దర్
కోమటోళ్లు అనే పదం వాడినందుకే ఇంత ఆగ్రహానికి గురవుతున్నారని.. కులం పేర్లతోనే ఇప్పటికీ తమను దూషిస్తున్నారని దాని సంగతేంటని ప్రజా యుద్దనౌక గద్దర్ అన్నారు. చెప్పరాని మాటలతో ఐలయ్య మీద దాడికి దిగడం సరైన చర్య కాదన్నారు.
ఆధిపత్య కులాలన్ని వేల ఏళ్లుగా ఉత్పత్తికి దూరంగానే ఉన్నాయని అదే విషయాన్ని ఐలయ్య తన పుస్తకాల్లో ప్రస్తావిస్తున్నారని అన్నారు. తన సిద్దాంతాల్ని వ్యక్తీకరించిన ఐలయ్యను చంపుతామనడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలన్ని ఒక పథకం ప్రకారమే జరుగుతున్నాయని అన్నారు.
ఆర్ఎస్ఎస్ హస్తం: తమ్మినేని వీరభద్రం
ఐలయ్యకు వస్తున్న బెదిరింపుల వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయనపై బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
ఓయూలో ర్యాలీ:
కంచ ఐలయ్యకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి ఓయూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి సీఐకి వినతిపత్రం అందించారు. ఐలయ్యను బెదిరింపులకు గురిచేస్తున్నవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.