చేజారుతున్న నేతలు.. నిలువరించే ప్రయత్నం చేయరా..?
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన సమయంలో నేతలు పార్టీ మారుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అదిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పదే పదే వాయిదా పడటం, నాగం చేరిక సందర్భంలో అధిష్టానం సంప్రదింపుల పై ఉత్తమ్ దాటవేత ధోరణి ప్రదర్శించడం, పీసీసీ పునర్ వ్యవస్థీకరణ విషయంలో అధిష్టానం ప్రతిపాదనలకు మోకాలడ్డడం లాంటి సంఘటనలలో రాహుల్ టీం ఉత్తమ్ పట్ల ఒకింత అసహనంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
బలోపేతం కావాల్సిన తరుణంలో బలహీన పడితే భవిష్యత్తు ఉంటుందా..?
ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ? కాంగ్రెస్ పార్టీ తాను చాలా బలంగా ఉన్నానని చెప్పుకునే దక్షిణ తెలంగాణలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక ఉత్తరం పరిస్థితి ఏమిటి ? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాంటి చోట్ల నాయకులు ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్థానిక రాజకీయ పరిస్థితులు ఎలాగైనా ఉండి ఉండవచ్చు. నాగం జనార్దన్ రెడ్డి రాక దామోదర్ రెడ్డికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిఒక్క నాయకుడుని కాపాడుకోవాల్సిన బాద్యత కాంగ్రెస్ కు ఉంది. అయితే, ఆ పార్టీ పీసీసీ నాయకత్వం ఈ పరిణామాలను చాలా లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ఉత్తమ్ ఏకాబిప్రాయం ఎందుకు సాధించలేకపోతున్నారు.
నాగం జనార్ధన్ రెడ్డి చేరిక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరిగింది. తన మాటను కాదని నిర్ణయం తీసుకున్నందున పరిణామాలు ఎలా ఉంటాయో అధిష్టానానికి తెలియాలని ఉత్తమ్ భావిస్తున్నారేమో తెలియదు. దామోదర్ రెడ్డితో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని తెలిసి కూడా ఆపే ప్రయత్నం పెద్దగా జరిగినట్టు లేదు. ‘వారితో మాట్లాడాను... పార్టీ వీడబోర 'ని మీడియా చిట్ చాట్ లలో చెప్పడమే తప్ప, వారిని నిలువరించేందుకు పీసీసీ చీఫ్ గట్టి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు, ఎడ్మ కిష్టారెడ్డి, అబ్రహంలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. దామోదర్ రెడ్డి కంటే నాగం జనార్ధన్ రెడ్డి బలమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కానీ, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కనీసం అయిదు వేల ఓట్లైనా దామోదర్ రెడ్డి ప్రభావితం చేయగలరు. పోటా పోటీగా ఎన్నిక జరిగిన సందర్భంలో ఆ అయిదు వేల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి.
గ్రూపు రాజకాయాలు ఇంకా కొనసాగాల్సిందేనా..
ఇక అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాం పరిస్థితి కూడా అదే. అక్కడ ఎమ్మెల్యే సంపత్ బలమైన నాయకుడే కావచ్చు. కానీ, అబ్రహాం పార్టీని వీడటం ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. పైగా సంపత్ కు ఈ సారి డికే అరుణ మద్ధతు ఎంత మాత్రం ఉండదు. ఇక కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఒకింత బలమైన నాయకుడే. సుమారు 15 నుంచి 20 వేల ఓట్లను ఆయన ప్రభావితం చేయగలడన్నది కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇలాంటి నాయకులను వదులుకోవడం ద్వారా కంచుకోట అనుకున్నచోట కాంగ్రెస్ పార్టీ కష్టాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేఅంతటి సమర్ధత ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదని ఆ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. అయితే, ఉన్నవాళ్లలో ఆయన ఒక్కడే అందరినీ కలుపుకొని వెళతారన్న భావనలో ఢిల్లీ నాయకత్వం ఉంది. అందుకే పీసీసీ అధ్యక్షుడుని మార్చాలన్న డిమాండ్ పలుసార్లు వచ్చినా అధిష్టానం దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తమ్ ను మార్చితే ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమ్ ను మార్చి తేనెతుట్టెను కదపడం దేనికీ అన్న ఉద్దేశంతోనే ఆయనను పదవిలో కొనసాగిస్తున్నారు.
అదిష్టానం జోక్యం చేసుకోకపోతే పార్టీ దెబ్బతినే పరిస్థితి..
అందరినీ కలుపుకొని పోతారన్న అభిప్రాయం అధిష్టానానికి ఉన్నంత వరకు ఉత్తమ్ పదవికి డోకా లేదు. ఆ అభిప్రాయం మారితే మాత్రం పీసీసీ చీఫ్ విషయంలో ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడం మిగతా నేతల పై కూడా కచ్చితంగా ప్రభావం చూపుతుంది. తన వర్గీయుడైన దామోదర్ రెడ్డి పార్టీ వీడటంతో ఆ ప్రభావం డీకే అరుణ పై ఉంటుంది . ఈ పరిణామంతో ఆవిడ బాగా మనస్థాపానికి గురయ్యారు. నాకెందుకొచ్చిందిలే అని ఆవిడ భావిస్తే దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్ లాంటి నియోజకవర్గాల్లో సైతం పార్టీకి నష్టం తప్పదు. అసంతృప్తులు మరింత రాజుకుంటే డీకే, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అదే జరిగితే... దక్షణ తెలంగాణలో కాంగ్రెస్ ఆశలు గల్లతుకావడం ఖాయం. మరి పీసీసీ చీఫ్ ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో చూడాలి.