ఇలా ఐతే తెలంగాణలో తెలుగుదేశం మనుగడ కష్టమే..!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి చేసిన గాయం ఇప్పట్లో మానేలా కనిపించడం లేదు. రేవంత్ పార్టీ నిష్కృమణ తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్ధితి చుక్కాని లేని నావలా తయారైయ్యింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలు పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని పైకి చెబుతున్నప్పటికీ సారధ్య బాధ్యతలపై ఆందోళన చెందుతున్నారు. పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే సంస్థాగతంగా బలోపేతం చేస్తామంటున్న సీనియర్ నేతలు ఎంత వరకి ఆ మాటలకు కట్టుబడి ఉంటారో సస్పెన్స్గా మారింది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకుడు కావాలి.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల మాత్రం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ తరువాత ఆ స్ధాయిలో పార్టీని నడిపించే నేత ఎవరనే అంశంపై కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీని బలోపేతం చేస్తూనే కార్యకర్తలకు ధైర్యం నూరిపోసే నాయకుడు ఎవరనే అంశంపై కూడా సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే జిల్లాల వారిగా నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడడంతో డీలా పడిపోతున్న తెలుగుదేశం పార్టీకి ముందుండి పార్టీని నడిపించే కధానాయకుడు ఎవరనే అంశంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన సందేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో కార్యకర్తల్లో కొంత అసహనం నెలకొంది.
ఎన్నో సమస్యలు.. కార్యాచరణ మాత్రం జీరో..
అడపా దడపా సమావేశాలు నిర్వహించి పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తామని ప్రస్తుత నాయకత్వం చెప్పే మాటలను కార్యకర్తలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. పార్టీకి అండగా మేము ఉన్నామని చెబుతున్న సీనియర్ నేతల మాటలపై పెద్దగా విశ్వాసం చూపించడం లేదు. ఇంత వరకు క్షేత్రస్ధాయిలో ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించిన దాఖలాలు లేకపోవడంతో కార్యకర్తల్లో నైరాష్యం నెలకొంది. రోజుకో జిల్లా చొప్పున నాయకులు పార్టీ మారుతున్నా, సీనియర్లని చెప్పుకుంటున్న నేతలు కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేది ఎవరు..
119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో పెడతామని పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎన్నికల కన్నా ముందు పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ప్రభుత్వ అసమర్ధ విధానాలను ఎత్తి చూపడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. రూపకల్పన చేయడమే కాకుండ ముందుండి కీలక బాధ్యతలు స్వీకరించాలి. అలాంటి నేత ఎవరనేదానిపై టిడిపి శ్రేణుల్లో ఎదురు చూపులు మొదలైయ్యాయి. పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్న ఎల్.రమణ కాని, పెద్దిరెడ్డి గానీ ఇంత వరకు ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. దీంతో విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీలోకి తరలిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మిగిలి ఉన్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎలాంటి భరోసా ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
పార్టీకి ఆక్సీజన్ అందించే నాయకుడు కావాలంటున్న క్యాడర్..
ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించకుండా కాలయాపన చేయడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ వదిలేసిన నాయకుడి గురించి ఎన్ని రోజులు చర్చను సాగదిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ నియోజకవర్గ టీడిపి నేతలను పిలిచి పార్టీ పరిస్థితిపై సమీక్ష కూడా నిర్వహించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్ధితి అన్ని జిల్లాల్లో నెలకొనడంతో పార్టీలో నిరాశ, నిస్పృహ ఆవహించాయనే చర్చ జరుగుతుంది. పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించి పరుగులు పెట్టిస్తానన్న సీనియర్ నేతలు, పరిస్థితి పూర్తిగా చేజారిపోక ముందే మేల్కొంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 22శాతం ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకును ప్రస్తుత నేతలు ఎంత వరకు పెంచుతారనే అంశంపై కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.