తెలంగాణ మహానాడుకు మోత్కుపల్లి గైర్హాజరు, ప్రభుత్వంపై మండిపడిన ఎల్ రమణ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం టీడీపీ పని చేస్తోందన్నారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి బడుగుల అభివృద్ది కోసం పని చేస్తోందన్నారు.
Recommended Video
తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం చూడలేక నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో మినీ మహానాడు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ధన దోపిడి పెరిగిందని, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని, సామాజిక న్యాయం కొరవడిందన్నారు.
ఈ ప్రభుత్వంలో ఒకటి రెండు సామాజిక వర్గాలకే అధికారం పరిమితమైందని ఆరోపించారు. మహిళలకు కేబినేట్లో స్థానం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయనడానికి కర్ణాటకనే నిదర్శమన్నారు.
మహానాడుకు మోత్కుపల్లి గైర్హాజరు
తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడుకు తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా రాలేదని తెలుస్తోంది. మోత్కుపల్లి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెరాసలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.