కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ మండిపాటు, పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ఏ వర్గమూ సంతృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.
కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. కేసీఆర్ చెప్పిన రుణమాఫీ కారణంగా రైతులకు అప్పు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వెల్లో రైతులు మరణించారని, వారిని ఇప్పటి వరకు పరామర్శించలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నాలుగేళ్లలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో మూతబడిన పాఠశాలలు, పరిశ్రమలు చాలా ఉన్నాయన్నారు.
కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో నాయకులు పాల్గొనున్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలోని తప్పులను ఎత్తి చూపనున్నారు.