విజయది పాశవిక హత్య, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, తహశీల్దార్ మర్డర్పై మంత్రి కేటీఆర్
అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హఠాన్మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయ మృతిచెందారనే వార్త షాక్ కలిగించిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విజయారెడ్డిది అత్యంత పాశవిక హత్య అని ఆయన ఆరోపించారు. పరిష్కారం లేని అంత పెద్ద సమస్య ఏముందని ఆయన ప్రశ్నించారు.
విజయారెడ్డిపై జరిగిన ఘటన అమానవీయమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఓ అధికారిపై అత్యంత పాశవికంగా దాడి చేసి ఎలా మట్టుబెడతారని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం దారుణం జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు తహశీల్దార్తో మాట్లాడాలని సురేశ్ లోపలికి వెళ్లారు. దాదాపు అరగంట ఛాంబర్లో ఉన్నారు. బయటకొచ్చిన వెంటనే విజయారెడ్డి కూడా వచ్చారు. అయితే అప్పటికే ఆమెకు మంటలు పూర్తిగా అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడబోయారు.
అప్పటికే తీవ్రగాయాలైన విజయారెడ్డి మృతిచెందారు. తహశీల్దార్కు నిప్పంటించిన సురేశ్ వెంటనే పీఎస్ వద్దకెళ్లాడు. కానీ అతనికి కూడా 60 శాతం గాయాలు కావడంతో పోలీసులు అతనిని హయత్నగర్లోని సన్ రైజ్ ఆస్పత్రికి తరలించారు. విజయారెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అయితే అతని తల్లి పద్మ సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పడం కలకలం రేపింది.