కస్టడీలో ఏం రాబట్టినట్టు?: రాజీవ్, శ్రవణ్లు కొత్తగా చెప్పిందేంటి?, 'శిరీష' ఇక మిస్టరీయేనా!
తేజస్వినిని బెదిరించడానికి శిరీషనే వారిని పురమాయించిందా?, రాజీవ్ కు తెలియకుండా ఈ వ్యవహారం నడిపిందా?.. ఒకవేళ రాజీవ్ కు తెలియకపోయినా..
హైదరాబాద్: అనుమానాలు అనుమానాలుగానే మిగిలిపోయాయి. కుటుంబ సభ్యులు ఇంకా హత్యే అని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆత్మహత్యే అని తేల్చిపారేశారు. బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటికీ వీడని చిక్కుముడులెన్నో!..
ఈ నేపథ్యంలో నిందితులు శ్రవణ్ రాజీవ్ లను కస్టడీలోకి తీసుకుని పోలీసులు రాబట్టిందేంటి? అన్న ప్రశ్న సహజంగానే అందరిలోను వ్యక్తమవుతోంది. నిందితులిద్దరూ కస్టడీలోను పాత కథే చెప్పారు. పోలీసులు సైతం కస్టడీ అనంతరం అవే వివరాలను వెల్లడించారు. నిందితులను కాపాడాల్సిన అవసరం తమకు లేదని చెబుతున్నప్పటికీ.. విచారణ జరిగిన తీరు మాత్రం అనుమానాలకు తావిచ్చేదిగానే ఉంది.
మరో ట్విస్ట్: 6 నెలలుగానే ఆర్ జె స్టూడియోలో శిరీష వర్క్, మాజీడిజిపి ఘటనపై విచారణ
రెండో రోజు కస్టడీలో అర్థరాత్రి పోలీసుల హైడ్రామా కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. నిందితులను కుకునూర్ పల్లికి తీసుకెళ్లిన పోలీసులు.. అసలు స్టేషన్ కే తీసుకెళ్లకుండా.. రహదారుల పైనే చక్కర్లు కొడుతూ.. తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చేశారు.
నిగ్గు తేలనివి?:
కస్టడీకి ముందు ఎన్నో విషయాలు నిగ్గు తేలుతాయి అని ఆశించినప్పటికీ.. అంతకుముందున్న అరకొరా స్పష్టతే ఆ తర్వాత కూడా మిగిలిపోయింది. మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్ర గురించి పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.
రాజీవ్ రాసలీలు, అతని వంచన వ్యక్తిత్వమే శిరీషను బలి తీసుకుందా? లేక మేకవన్నె పులి లాంటి శ్రవణే శిరీషను ట్రాప్ చేయాలని చూశాడా?.. అదీ కాకపోతే ఇద్దరూ కూడబలుక్కుని ఎస్ ప్రభాకర్ రెడ్డి వద్ద శిరీషను బలిపశువును చేయాలనుకున్నారా? అన్న ప్రశ్నలకు నిందితుల నుంచి బొటాబొటి సమాధానాలే వచ్చాయి.
క్లోజ్ చేసేస్తారా?:
అటు ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం తమవాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బలంగా వాదిస్తుండటం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా రెండు ఆత్మహత్యల చుట్టూ వీడని మిస్టరీ ఏదో ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ ఇంతకుమించి ముందుకు సాగే అవకాశాలు లేని నేపథ్యంలో.. ఇప్పటివరకు నిందితుల నుంచి రాబట్టిన వివరాల మేరకే కేసు క్లోజ్ అవుతుందా? అనేది వేచి చూడాలి.
నందు నవీన్లు ఎవరు?:
తేజస్వినితో గొడవ విషయంలో నందు, నవీన్ లతో శిరీష మాట్లాడిన ఆడియో టేపులు కూడా ఎలా లీకయ్యాయన్నది ఇంతవరకు తెలియరాలేదు. అసలు వారిద్దరు ఎవరన్నది కూడా స్పష్టత లేకుండా పోయింది. మాకు తెలియదంటే, మాకు తెలియదని నిందితులిద్దరు, అటు తేజస్విని కూడా అదే చెబుతోంది.
తేజస్వినిని బెదిరించడానికి శిరీషనే వారిని పురమాయించిందా?, రాజీవ్ కు తెలియకుండా ఈ వ్యవహారం నడిపిందా?.. ఒకవేళ రాజీవ్ కు తెలియకపోయినా.. శ్రవణ్ కు తెలిసే వీలు ఉంటుంది కదా? అన్న అనుమానాలకు సమాధానమే లేదు.