గులాబీలో అసమ్మతి సెగలు: ఎర్రబెల్లిపై తక్కెళ్లపల్లి సంచలన వ్యాఖ్యలు, మరికొన్ని స్థానాల్లోనూ
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించన నాటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని నేత తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
పొమ్మనలేక పొగబెడుతున్నారు!, కేటీఆర్కు ఫోన్ చేసినా..: టీఆర్ఎస్పై సురేఖ నిప్పులు
గులాబీలో అసమ్మతి సెగలు
గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసి టీఆర్ఎస్లో చేరినవారికి ఈసారి టికెట్ కేటాయించడంపై ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగాలేనప్పటికీ మళ్లీ వారినే బరిలో నిలపడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు.
చిట్టెంకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం
మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ స్థానం తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి కేటాయించడంపై పలువురు టీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నర్వ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అసమ్మతి సభను నిర్వహించారు. ఈ సభకు మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రామ్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్ను కోరుతున్నారు.
సత్యనారాయణ అసమ్మతి గళం
సంగారెడ్డి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అసమ్మతి రగులుతోంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం కేటాయింపుపై టీఆర్ఎస్ అధినేత పునరాలోచించాలని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరుతున్నారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ద్రోహం చేసిందని విమర్శించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని పని చేశామని, కానీ, తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009, 2014 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని తెలిపారు. సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.
పాలకుర్తిపై తక్కెళ్లపల్లి రవీందర్ రావు..
వరంగల్ జిల్లాలోనూ అసంతృప్తులు బహిరంగంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజకవర్గం పాలకుర్తిలో ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు గళం వినిపించారు. పాలకుర్తి అసెంబ్లీ స్తానంపై కేసీఆర్ పునరాలోచించుకోవాలని రవీందర్ రావు కోరారు.
ఏం చేశారని ఎర్రబెల్లికి టికెట్ ఇచ్చారు?
తన పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలతో సమావేశమైన రవీందర్ రావు.. ఎర్రబెల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నాలుగేళ్లలో పాలకుర్తి నియోజకవర్గానికి ఎర్రబెల్లి చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. తాను మొదటినుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. కానీ, ఎర్రబెల్లి టీడీపీ నుంచి వచ్చారని అన్నారు. ఈసారి కేసీఆర్ తనకే టికెట్ ఇవ్వాలని రవీందర్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అసమ్మతులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అధిష్టానం తదుపరి చర్యలపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.