తలాక్ చెప్పడంతో మనస్థాపం .. పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్యయత్నం
హైదరాబాద్ : ముస్లింలు విడిపోయే సమయంలో చెప్పే త్రిపుల్ తలాక్ .. ఓ వివాహిత ఆత్మహత్యయత్నానికి దారితీసింది. కలిసి ఉంటానని చేయి పట్టిన భర్తే .. తలాక్ చెప్పడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఆమె పిల్లలకు తాడు కట్టి ట్యాంక్ బండ్ లో దూకాలని నిర్ణయానికి కారణమైంది. అయితే అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకోవడంతో ఆత్మహత్యకు బ్రేక్ పడింది.
తలాక్ చెప్పడమే నిర్ణయానికి కారణం ..
టోలిచౌకికి చెందిన వివాహితకు .. ఇద్దరూ పిల్లలు. భర్త పిల్లలతో సంసారం సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ .. భర్త రూప రాక్షసుడు తలాక్ చెప్పడం ఆ కాపురలో చిచ్చురాజేసింది. వద్దని ఆమె చెప్పిన వినకుండా ఆ ప్రబుద్దుడు తలాక్ చెప్పడంతో ఇక బతికి ఉండి ప్రయోజనం లేదని భావించింది. పిల్లలతో కలిసి ట్యాంక్ బండ్ లో దూకాలని నిర్ణయించుకొని వచ్చింది. ఒక వేళ పిల్లలు ఒడ్డుకు వస్తే ఎలా .. వారి బాగోగులు ఎవరు చూస్తారని భావించేమో కానీ వారికి తాడు కట్టి ట్యాంక్ బండ్ లో దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న కొందరు చూడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే పిల్లలతో సహా ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన లేక్ పోలీసులు .. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావని ఆరాతీస్తే ... విషయం బయటపడింది. తర్వాత పోలీసులు వివాహితకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
వేధింపుల వల్లే ...
తన భర్త వేధించేవాడని పోలీసుల వద్ద వివాహిత వాపోయింది. రోజు వచ్చి గొడవ చేసేవాడని తెలిపింది. ఇటీవల విడిపోదామనే టార్చర్ ఎక్కువైందని .. తలాక్ చెప్పడంతో ఇక జీవితం వ్యర్థమని ఆత్మహత్య చేసుకోవాలని డిసైడైనట్టు పోలీసులకు వివరించింది.
ఏంటీ తలాక్ .. దీనిపై చట్టం ఏం చెబుతోంది ...?
ముస్లింలలో భార్య, లేదా భర్త .. మత పెద్ద సమక్షంలో తలాక్ తలాక్ తలాక్ అని మూడుసార్లు చెబితే వారు విడిపోయినట్టే. అయితే ఈ తలాక్ తో ముస్లిం వివాహితలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ముస్లిం మత పెద్ద సమక్షంలో చెప్పాల్సిన తలాక్ .. భార్య వద్ద చెప్తున్నారు కొందరు. మరికొందరు బరితెగించి ఫోన్లలో లేదాంటే లైవ్ వీడియో కాల్ లో చెపుతూ తమ పిచ్చిని బయటపెడుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు వాట్సాప్ ఆడియో కాల్ చేసి తలాక్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తలాక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ముమ్మారు తలాక్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుకు సవరణలు కూడా చేసి లోక్ సభ ఆమోదం పొందింది. రాఫెల్ కేటాయింపులు .. ఇతర అంశాల వల్ల రెండుసార్లు రాజ్యసభలో మాత్రం మోదీ సర్కార్ ఆమోద ముద్ర వేసుకోలేకపోయింది.
ఎందుకు ఆమోదం పొందలేదంటే ..?
త్రిపుల్ తలాక్ బిల్లును మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించిన ... రాజ్యసభలో ఎందుకు ఆమోదం పొందలేదనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం ఈ బిల్లులో ప్రభుత్వం రూపొందించిన కఠిన చట్టాలే అనే వాదన వినిపిస్తోంది. తలాక్ పై భార్య లేదా ఆమె సన్నిహితులే ఫిర్యాదు చేయాలని ... ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకు బెయిల్ ను మేజిస్ట్రేటే ఇవ్వాలనే నిబంధనకు విపక్షాల నుంచి నిరసన ఎదురైంది. వీటితోపాటు తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించాలని చట్టం చేయడం .. జైల్లో ఉన్న సమయంలో భార్యకు ఎవరు భరణం ఇస్తారనే అంశంపై స్పష్టత లేదని ... ఇంతటి కఠినచర్యలు తీసుకున్నాకా కూడా కుటుంబాలు కలిసి ఉంటాయా అనే సందేహాలు విపక్షాలు లేవనెత్తాయి. ఈ లోపాలను సరిదిద్దేందుకు వీలుగా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో బిల్లు గట్టేక్కని పరిస్థితి. ఎగువసభలో ఎన్డీఏ సర్కార్ కు మెజార్టీ లేకపోవడం కూడా ఒక కారణం. అసలు విషయం ఏంటంటే .. రాఫెల్ కేటాయింపులు, ఇతర అంశాల వల్ల శీతకాల పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సెషన్ లో బిల్లులపై చర్చ జరగని పరిస్థితి. దీంతో లోక్ సభలో ఆమోదం పొందిన తలాక్, పౌరసత్వ బిల్లు రాజ్యసభలో గట్టెక్కని పరిస్థితి నెలకొంది.