రంగనాథ్ మృతి: బాధాకరమని తలసాని, జీవితం సాఫిగా ఉందన్నారని చిరు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ మృతి పైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు స్పందించారు. రంగనాథ్ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. రంగనాథ్ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులు సంతాపం తెలిపారు.
రంగనాథ్ నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని రాజ్యసభ సభ్యుడు, నటుడు చిరంజీవి ఆదివారం అన్నారు. రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధించిందన్నారు. తాము ఇద్దరం కలిసి సినిమాలో పని చేశామన్నారు. తన జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పారని, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
కాగా, రంగనాథ్ భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్ తరలించారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మురళీమోహన్, జమున, రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీ రాజా, శివకృష్ణ, ఏడిద శ్రీరాం, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నివాళులర్పించారు.