రేవంత్ వంటి దొంగా, రిజైన్ చేశా ఎవరొస్తారో రండి: తలసాని, చిట్టా విప్పుతానని, లిస్ట్ చదివి
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ దొంగ కూడా తన గురించి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు కనీసం చర్యలు తీసుకోలేదన్నారు.
ఒక్కో శాసన సభకు ఒక్కో చట్టం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను ఎన్నికలకు సిద్ధమని, మీలాగా డొంక తిరుగుడుగా మాట్లాడనని చెప్పారు. తాను డిసెంబర్ 16న రాజీనామా చేశానని, అప్పుడే కాపీని మీడియాకు ఇచ్చానని చెప్పారు.
అందరి చరిత్ర తన వద్ద ఉందని చెప్పారు. ఎవరు వచ్చినా తాను ఎన్నికలకు సిద్ధమని చెప్పారు. తన గురించి మాట్లాడే వాళ్లు మొదట వాళ్ల గురించి ఆలోచించుకోవాలన్నారు. గవర్నర్కు తన పైన ఫిర్యాదు చేయడం విడ్డూరమని, తనపైన చెప్పినప్పుడు మిగతా జంప్ జిలానీల గురించి కూడా చెప్పాలన్నారు.
తన గురించి మాట్లాడే వారు మొదట వారి కేరక్టర్ తెలుసుకుంటే మంచిదన్నారు. లేదంటే వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. నేను సభాపతికి రాజీనామా ఇచ్చానని చెప్పారు. 16వ తేదీన రాజీనామాను ఇచ్చానని చెప్పారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైయస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నర్సింహులు టిడిపిలో చేరారని, అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత వైయస్ సీఎంగా ఉన్నప్పుడు 9 మంది టిఆర్ఎస్ నేతలు చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడేం చేశారన్నారు.
2014లో నంద్యాల నుండి గెలిచిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలు వైసీపీ నుంచి గెలిచి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని చెప్పారు. జూపూడి ప్రభాకర్ రావు, రుద్రరాజు పద్మరాజులు ఏ పార్టీకి చెందిన వారో చెప్పాలన్నారు. వారు టిడిపిలో ఎందుకు చేరారన్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపొందిన దిలీప్ కుమార్ ఏ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపిలో చేరారని, కంతేటి సత్యనారాయణ రాజు కూడా బిజెపిలో చేరారని, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారని గుర్తు చేశారు. అలాంటప్పుడు బిజెపి కిషన్ రెడ్డి తన గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
ఎవరైనా తన గురించి మాట్లాడే ముందు వారి గురించి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురి పేర్లు ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకట రమణా రెడ్డి, షబ్బీర్ అలీ, టిడిపి నేతలు పెద్ది రెడ్డి, రేవంత్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరుల పైన మండిపడ్డారు.
గండ్ర, పెద్దిరెడ్డిలు తన పైన 420 కేసు పెట్టాలని చెప్పడం విడ్డూరమన్నారు. బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలు టిడిపిలో ఎలా చేరారని ప్రశ్నించారు. వైయస్ హయాంలో టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏం చేశారన్నారు. కంతేటి, దిలీప్ కుమార్ చేరికల పైన బిజెపి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.