ఆంధ్రోళ్లను ఉండనీయరని ప్రచారం: తలసాని, టిఆర్ఎస్ 'సెటిలర్స్' పాట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రోళ్లను ఉండనీయరని, వెళ్లగొడతారని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు అన్నారు. హైదరాబాదుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన వారు టిఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలనేది సీఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదులో నీటి సమస్య రాకుండా రెండు రిజర్వాయర్లు నిర్మిస్తన్నామన్నారు. శాంతిభద్రతలు, నీళ్లు, నియామకాల పైన దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల మాటలు వినకుండా వరంగల్లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుని పోతుందన్నారు.
తెలంగాణ వస్తే ఆంధ్రోళ్లను ఉండనీయరని వెళ్లగొడతారని పుకార్లు పుట్టించారన్నారు. కానీ ఇవాళ అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. దేశ సంస్కృతి మొత్తం హైదరాబాద్లో కనిపిస్తుందన్నారు. బంగారు తెలంగాణ ఏర్పడి పేదలంతా సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారన్నారు.
వచ్చే నెలలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
శ్రీనగర్, సుల్తాన్ బజార్ మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.