నేను మంత్రినయ్యా..మరి మీరు: తలసాని వ్యాఖ్యలకు గోరంట్ల, కళా నవ్వులు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం ఉదయం ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నేత, ఇప్పటి టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు ఈ ఉదయం తారసపడ్డారు.
ఈ సందర్భంగా తలసాని వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన తనకు మంత్రి పదవి వచ్చిందని.. ఏపీలో అధికారంలో ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదని వారితో అన్నారు.
దీంతో ఏం సమాధానం చెప్పకుండానే.. ఆ టిడిపి నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ఒకేసారి జరుగుతుండటంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు లాబీల్లో కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇలాంటి ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.