రాజీనామా లేఖ మాకెందుకిస్తారు: తలసాని రాజీనామాపై కొత్త ట్విస్ట్
హైదరాబాద్: గత శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వివాదం పైన మరో ట్విస్ట్! ఆర్టీఐ చట్టం కింద తలసాని రాజీనామా చేయలేదని తేలినట్లు కాంగ్రెస్, టిడిపి నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.
దీనిపై తెలంగాణ శాసన సభ అధికారులు వివరణ ఇచ్చారు. తలసాని రాజీనామా లేఖపై తాము సాంకేతికంగా సమాధానం పంపించామని, దీంట్లో కొత్తేమీ లేదని తెలంగాణ శాసనసభ అధికారులు చెబుతున్నారు. తలసాని రాజీనామాను తమకు ఇవ్వలేదని, స్పీకర్కు ఇచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన దానిలో తెలంగాణ శాసనసభ సచివాలయానికి రాజీనామా లేఖ వచ్చిందా? అని మాత్రమే అడిగారని, దానికి తాము రాలేదని చెప్పామని అన్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సభాపతికి ఇస్తారని, వాటిని ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడం సహా మిగిలిన ప్రక్రియ కోసం శాసనసభ సచివాలయానికి లేఖ రాస్తారని, స్పీకర్కు లేఖ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా శాసనసభ సచివాలయానికి పంపించే ఆనవాయితీ ఏమీ లేదంటున్నారని తెలుస్తోంది. రాజీనామా స్పీకర్ పరిధిలోని అంశమని చెబుతున్నారు.