ప్రధాని మోడీయే మెచ్చుకున్నారు, కేటీఆర్ సవాల్ మాటేంటి: తలసాని
ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణను మెచ్చుకుంటుంటే, ఇక్కడి విపక్ష పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని, తమ పైన ఆరోపణలు చేయడం విడ్డూరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు విపక్షాల పైన దుమ్మెత్తి పోశారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రధాని తెలంగాణ పాలనను మెచ్చుకుంటుంటే, ఇక్కడి విపక్ష పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తూ ఆరోపణలు చేయటం తగదన్నారు.
అవినీతిపరులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాస నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. పాలేరు ఉప ఎన్నికలో ఓడిపోతే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్కు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
తుమ్మల అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తుమ్మల అన్నారు. కేసీఆర్, తుమ్మలతోనే తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని, సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కెటిఆర్ పైన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 24 జిల్లాల ఏర్పాటును జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాస్త్రీయ కోణంలో జిల్లాలను పునర్విభజన చేసినట్లు వివరించారు.