'ఎన్నికల్లో బాబుకు చుక్కలే, ఓడించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్, ప్రతిపక్ష హోదా రాదు'
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు మనుషుల నీడను చూసి కూడా భయపడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థానంలో ఎవరు ఉన్నా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహం
చంద్రబాబు స్థానంలో ఎవరున్నా ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది
చంద్రబాబు గ్లోబల్కు రిలేటివ్ అని, అందుకే చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేస్తారని తలసాని అన్నారు. కేటీఆర్, జగన్ భేటీ అయితే అది మోడీ కుట్ర అని ఏపీ దద్దమ్మ మంత్రులు మాట్లాడుతున్నారని, అసలు మనుషుల నీడ చూసి భయపడే మీకు ఏదైనా చెబుతారన్నారు. ఒక నీతిలేని మాటలు మాట్లాడుతారన్నారు. ఏదైనా రాజకీయ పబ్బం కోసమే మాట్లాడుతారన్నారు. చంద్రబాబు స్థానంలో ఎవరు సీఎం అయినా బ్రహ్మాండంగా పని చేస్తారన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని మీరు ఎవరిని బెదిరిస్తున్నారని తలసాని ప్రశ్నించారు. మిమ్మల్ని పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మరో మూడు నెలల్లో చంద్రబాబును ఇంటికి పంపిస్తారన్నారు. ఈ చంద్రబాబు మాకొద్దు అనే నినాదంతో ముందుకు సాగుతున్నారన్నారు.
చంద్రబాబుకు దమ్ముంటే ఆపాలి
నాడు ఎన్టీఆర్ టీడీపీని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించారని తలసాని చెప్పారు. అలాంటి పార్టీని అదే కాంగ్రెస్ కాళ్ల వద్ద పెడుతున్న మీకు రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కాంగ్రెస్ రెండు రాష్ట్రాలను విడదీసి బొందపెట్టిందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఏమంటున్నారన్నారు. నాలుగేళ్లు మోడీతో సంసారం చేశారన్నారు. చంద్రబాబు ఇప్పుడు రాహుల్ గాంధీతో కొత్త సంసారం మొదలు పెట్టారన్నారు. మేం ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మేం చెప్తే వినేవాళ్లు ఏపీలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయకుండానే ఎంతో చేసినట్లుగా చెప్పుకుంటుందని, ఈ విషయాన్ని అక్కడకు వచ్చి చెప్తామన్నారు. మొన్న వచ్చి చెప్పిందానికంటే రెట్టింపు ఉత్సాహంతో వచ్చి చెబుతాని అన్నారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే అక్కడి బీసీలను, నా కమ్యూనిటీని ఆపాలన్నారు. నాలుగేళ్లయినా అమరావతి ఎందుకు నిర్మించలేదన్నారు.
ఏపీకి వస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
భయపెట్టించి, నేను పార్టీ నుంచి బయటకు పంపిస్తానని చంద్రబాబు హెచ్చరికలు చేయడం ఏమిటని తలసాని అన్నారు. అసలు మీరు వార్నింగ్ ఇవ్వడం ఏమిటని, వారే మిమ్మల్ని బహిష్కరించే సమయం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీకి బీసీలు సహకరించారని చెప్పారు. కానీ చంద్రబాబు కుళ్ళు రాజకీయాల కారణంగా నష్టపోతున్న బీసీలు ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు నిద్ర లేచినా, పడుకున్నా, రోడ్డు మీద ఉన్నా, శవం పక్కన ఉన్నా రాజకీయాలే అన్నారు. జగన్, కేటీఆర్ భేటీ పైన అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. మీరు తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేస్తే, మేం ఏపీకి వచ్చి చేయవద్దా అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మీరు రాలేదా, మీ అధికారులను పంపించలేదా అన్నారు. అన్నీ చేసి ఈ రోజు నంగనాచిలా మాట్లాడితే ఎలా అన్నారు. ఏపీ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తామని చెప్పారు. జగన్, కేటీఆర్ భేటీపై మాట్లాడుతూ ముసుగుతీసిన దొంగలు అంటున్నారని, అలా చేసింది మీరేనని టీడీపీ, కాంగ్రెస్ దోస్తీని ఉద్దేశించి అన్నారు. మేం ధైర్యంగా వస్తామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చెబుతామని అన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి నవ నిర్మాణ దీక్ష, ధర్మదీక్షలు అవసరమా అన్నారు. కోట్ల రూపాయల్లో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. సిగ్గులేకుండా మాట్లాడొద్దన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు.
చంద్రబాబును ఓడించేందుకు ఎన్టీఆర్ అభిమానుల వెయిటింగ్
ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని, అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సనత్ నగర్ వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని చెప్పిన ఆయనకు అసలు నీతి ఉందా అని తలసాని ప్రశ్నించారు. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడించేందుకు ఏపీ ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాంగ్రెస్ కాళ్ల వద్ద పెట్టారన్నారు.
ఏపీ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేయదు, సహకరిస్తాం
బంధుత్వాలను కూడా రాజకీయాలు చేసే వ్యక్తి, శవరాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని తలసాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్లపాలు చేసిన వ్యక్తికి బంధుత్వం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. దుర్గా టెంపుల్ సమీపంలో తాను రాజకీయాలు మాట్లాడనని మీడియా మిత్రులకు చెబితే, వాళ్లు మరింత ముందుకు తీసుకెళ్లి, ఇది మీడియా పాయింట్ ఇక్కడ మాట్లాడమని చెబితే తాను మాట్లాడానని అన్నారు. తిరుమల గేట్ వద్ద మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏపీకి రాకుండా ఉండేందుకు అదేమైనా వారి జాగీరా అన్నారు. ఏపీ ప్రజలను మా (తెరాస) పార్టీ మోసం చేయదని, మీకు సహకరిస్తామని నవ్యాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదని చెప్పారు. అవినీతిలో టీడీపీ నెంబర్ వన్గా ఉందన్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతి ఉందని చెప్పారు.
చంద్రబాబుకు చుక్కలే, ప్రతిపక్ష హోదా కూడా రాదు
అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు చుక్కలు చూపిస్తారని తలసాని అన్నారు. తమకు తెలిసి, ఏపీలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. తాము మోడీలేని, కాంగ్రెస్ లేని ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు.. సత్య హరిశ్చంద్రుడి చుట్టమని, అందుకే అన్నీ నిజమే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఏపీకి నేను వెళ్తెనే మంచి స్పందన వచ్చిందని, కేసీఆర్ వెళ్తే మరింత ఎక్కువ ఉంటుందన్నారు.