కుప్పకూలుతుంది: తెలంగాణ సర్కారుపై శ్యామల శాపనార్థాలు, అండగా వీహెచ్, తలసాని వివరణ
Recommended Video
హైదరాబాద్: జోగిని శ్యామల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బోనాల పండగను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు.. మహిళల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
శ్యామల కంటతడి.. ఆవేదన
మహిళలు ఒక్కొక్కరు దాదాపు 10-14కిలోల బరువు బోనంతో లైనులో నిల్చున్నారని, అయినా అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటలతరబడి భక్తుల క్యూలైన్లు ఆపేశారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ కంటతడి పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పడిపోతుందంటూ శాపనార్థాలు
మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందని శాపనార్థాలు పెట్టారు. కాగా, వీఐపీలు వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాటకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కంటతడి పెట్టుకుంటూ కొందరు అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. మీడియా ప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు ధర్నాకు దిగారు.
శ్యామల వ్యాఖ్యలపై మంత్రి తలసాని
సోమవారం నిర్వహించిన రంగం కార్యక్రమం అనంతరం జోగిని శ్యామల విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని తెలిసిందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకుమంత్రి తలసాని సూచించారు. శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు అని అన్నారు. ప్రభుత్వంపై శ్యామల వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
ప్రజలను బాధపెట్టొద్దు, సగం సంతోషమే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
శ్యామలకు వీహెచ్ మద్దతు
ఇది ఇలా ఉండగా, ప్రభుత్వంపై విమర్శలు చేసిన జోగిని శ్యామలకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మద్దతు తెలిపారు. శ్యామల చెప్పింది నిజమైతదని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన ముగియక తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణలో సర్పంచులకు అధికారాలు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కావాలనే నిర్వహించడం లేదని మండిపడ్డారు.
నియంతపాలనలో..
తెలంగాణలో నియంత రాజ్యం నడుస్తోందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడితే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. బీసీలకు తాయిలాలే తప్ప రాజకీయంగా న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య చెప్పి, ఇప్పడు మళ్లీ బీసీల గణణ అంటున్నారని ధ్వజమెత్తారు. కాగా, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీహెచ్ కోరారు. సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. తనకు ఇంకా ఓపిక ఉందని, ప్రజల్లో తిరుగుతానని వీహెచ్ తెలిపారు.