చంద్రబాబూ! సిగ్గులేదా.. అలా మాట్లాడితే, దమ్ముంటే ఏపీలో కేసీఆర్ను కలువు: తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. నిన్న కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అనేది లేదని చెప్పారని, కానీ ఆయనలా కుట్ర, దొంగ రాజకీయాలు చేసే అలవాటు తమకు లేదని చెప్పారు.
ఏపీలో ఎలా ఉంటావ్, ఎందుకలా చేశారో: జగన్-షర్మిలకు చంద్రబాబు గట్టి కౌంటర్
ఈ రోజు దేశంలోని రాజకీయ పరిణామాల్లో భాగంగానే తమ సీఎం కేసీఆర్ ఈ దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో చాలా రోజుల నుంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల సీఎంలను, ఆయా పార్టీల అధినేతలను కలుస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అందుకు కూడా భయపడుతున్నారన్నారు. అలాగే, తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంటే తలసాని నోరు ఎందుకు మెదపలేదన్న టీడీపీ నేత పంచుమర్తి అనురాధపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీలా చిల్లర రాజకీయాలు చేయం
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన 26 కులాలకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ ఆ 26 కులాలను కూడా బీసీ కమిషన్కు పంపించామని తలసాని చెప్పారు. తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. చంద్రబాబులాంటి మోసపూరిత జీవితం తమకు లేదన్నారు. ఏది చేసినా రాజకీయాలతో ముడిపెట్టే అలవాటు, చిల్లర రాజకీయాలు చేసే అలవాటు లేదన్నారు.
ఆ మాట అనేందుకు సిగ్గులేదా
అయినా చంద్రబాబుకు బంధువుల గురించి, బంధుత్వం గురించి, వ్యక్తుల గురించి ఎలా తెలుస్తుందని తలసాని ఎద్దేవా చేశారు. ప్రతి దానిని రాజకీయ కోణంలో చూసే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏపీని బాగా అభివృద్ధి చేస్తున్న సుందరాంగుడు ఈ చంద్రబాబు అంట.. మేమేదో అడ్డుకుంటున్నామట.. అని ఆయన నిప్పులు చెరిగారు. అసలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గులేదా అన్నారు. ఏదో అక్కడ (ఏపీలో) చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరూ ఏమీ అనరేమో కానీ, మా దగ్గర (తెలంగాణ) దానికి సమాధానాలు చాలా సీరియస్గా ఉంటాయని హెచ్చరించారు.
చంద్రబాబు నీకు దమ్ముంటే కేసీఆర్ను కలువు
మరొక విషయం ఏమంటే, నేను ఏపీకి వెళ్లి రాజకీయం చేశానని టీడీపీ నేతలు చెబుతున్నారని, మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని తలసాని అన్నారు. మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. (అయితే దుర్గ ఆలయం పరిధిలో రాజకీయాలు మాట్లాడటాన్ని కొందరు టీడీపీ నేతలు ఖండించారు.) దాదాపు 26 కేసులు వేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తివి అన్నారు. అలాంటిది చంద్రబాబు తమ ఎంపీ కవిత పోలవరం ప్రాజెక్టుపై కోర్టులో కేసు వేశారని చెప్పడం విడ్డూరమన్నారు. రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో ఏపీకి కేసీఆర్ వస్తున్నారని చెప్పారు. నీకు దమ్ముంటే లేదా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉంటే.. కేసీఆర్ ఏపీకి వచ్చాక ఆయన వద్దకు వెళ్లి మాట్లాడాలన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో ఆయన చెబుతారన్నారు.
కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తి
ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ, మీ అందమైన ముఖాన్ని రోజు మీడియాలో చూపించే ప్రయత్నాలు చేయడం లేదా టీవీలు, పేపర్ ప్రకటనలలో వందలాది కోట్ల రూపాయలను, ఏపీ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే మీరు మా గురించి మాట్లాడటం విడ్డూరమని తలసాని అన్నారు. మేం కులాల వారిగా చిచ్చుపెడుతున్నామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమైక్య ఏపీలో లేదా ఇప్పుడు నవ్యాంధ్రలో కులాల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి మీరేనని చంద్రబాబుపై మండిపడ్డారు. నాడు మాల, మాదిగల మధ్య, ఇప్పుడు కాపులకు, బీసీలకు మధ్య గొడవ పెట్టారన్నారు.
అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎందుకు
అసలు ఏపీలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో అందరికీ తెలుసునని, మొన్న ఏపీకి వెళ్లినప్పుడు నేను కూడా చూశానని తలసాని అన్నారు. అక్కడ తనతో చాలామంది చెప్పారని, 'ఈ బాబు మాకు వద్దు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పల్లెల్లో కరెంట్, నీళ్లు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు అది మారిపోయిందన్నారు. నేను లేకుంటే ఎవరూ అభివృద్ధి చేయలేరు అన్న రీతిన చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. మీ అందమైన ముఖాన్ని చూసి రైతులు 33వేల ఎకరాల భూమి ఇచ్చారా, అయితే అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తున్నారన్నారు.