ఎవర్ని అరెస్ట్ చేయాలో: తలసాని, చంద్రబాబు జేజమ్మ వచ్చినా: తుమ్మల
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి కూలడానికి సిద్ధంగా ఉందని, రేపు ఏదైనా ప్రమాదం జరిగితే విపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. ఆయన ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రేపు ఏదైనా జరగరానిది జరిగితే విపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాయన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వాస్తవ పరిస్థితి విపక్షాలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పైన కక్షతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఇది మరమ్మతుల కోసం నాటి ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు.
ప్రజలకు మంచి చేస్తామంటే విపక్షాలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారన్నారు. అభివృద్ధికి సహకరించకపోయినా కనీసం అడ్డుపడవద్దన్నారు. ప్రజలవి ప్రాణాలుకాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో ఎవరిని అరెస్టు చేయాలో అర్థం కావడం లేదన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: జగదీశ్వర్ రెడ్డి
కొన్ని పార్టీలు ఎక్కడ తమ ఉనికిని కోల్పోతామోనని భయపడి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ కావడం ఖాయమన్నారు. జయశంకర్ జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశారని చెప్పారు.
లావా మొబైల్ సంస్థ సీఎండీతో మంత్రి కేటీఆర్ భేటీ
లావా సహా వ్యవస్థపకులు సునీల్ బల్లా, ఆసంస్థ సిఎండి హరి ఓంరాయ్తో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీఎస్ఐపాస్ గురించి వివరించి రాష్ట్రంలో మొబైల్ తయారీ యూనిట్ను నెలకొల్పాల్సిందిగా కోరారు.
జయశంకర్ విగ్రహానికి కేసీఆర్ నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో జరిగిన జయశంకర్ జయంతి వేడుకలో సీఎం పాల్గొన్నారు.
అదేవిధంగా సచివాలయంలో జయశంకర్ చిత్రపటానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉద్యోగులు నివాళులు ఘటించారు. శాసనసభలో జరిగిన జయశంకర్ జయంతి వేడుకల్లో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా: తుమ్మల
చంద్రబాబు జేజమ్మ వచ్చినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వాటిని చేధించే బంగారు తెలంగాణను సాధించుకుంటామని ఆయన చెప్పారు.