విచారణ పూర్తయింది, లోపలేస్తాం: తలసాని హెచ్చరిక, ర్యాగింగ్పై ఢిల్లీలో గవర్నర్
హైదరాబాద్/ఢిల్లీ: ఇందిరమ్మ ఇళ్ల స్కాంలో విచారణ పూర్తయిందని, చాలామంది నిందితులుగా తేలారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం చెప్పారు. అభివృద్ధి పనులకు అడ్డుపడితే లోపలేస్తామని విపక్షాలను హెచ్చరించారు.
రాష్ట్రాన్ని దోచుకుంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలే అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, హుస్సేన్ సాగర్ పరిశుభ్రతను అడ్డుకుంటారా అని విపక్షాలను నిలదీశారు.
ధర్మేంద్రను పరామర్శించిన సీపీ మహేందర్ రెడ్డి
జూబ్లీహిల్స్ నీరూస్ సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఎల్ అండ్ టీ ఉద్యోగి ధర్మేంద్రను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కాల్పుల ఘటనా స్థలాన్ని సీపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముగ్గురు దుండగులను అరెస్టు చేశామని తెలిపారు. ముగ్గురిలో ఒకరు హైదరాబాద్, ఇద్దరు గుల్బర్గాకు చెందినవారన్నారు. దోపిడీ కోసం నాలుగురోజుల క్రితం హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారంతో పట్టుకున్నామని చెప్పారు.
ర్యాగింగ్ పైన ఢిల్లీలో గవర్నర్ స్పందన
ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ పైన కఠినంగా వ్యవహరించాలని మంత్రులకు గవర్నర్ సూచించారు.
ర్యాగింగ్ విషయమై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాలేజీల్లో ర్యాగింగ్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. ర్యాగింగ్ విషయంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాగింగ్ విషయమై ఇరు తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఆయన సూచించారు.