గెలవాల్సిన అభ్యర్థులు ఓడారెందుకు: ఉన్న ఓట్లకంటే అదనంగా ఓట్లు ఎలా పోలయ్యాయి..?
Recommended Video
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల సంఘం పొరపాటుతో ఈ ఎన్నికల్లో కొందరి అభ్యర్థుల తలరాతలు మారాయి. ఓట్లు గల్లంతు అవడం ఒక కారణం అయితే, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఈసీ విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో కూడా తప్పులు దొర్లాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోయారు... ఓటమి పాలవ్వాల్సిన అభ్యర్థులు గెలిచి గట్టున పడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)
ఉన్న ఓట్లకంటే అదనంగా పోలైన ఓట్లు
ఓ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన పునఃపరిశీలనలో పోలైన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు చూపించడం విశేషం. నోటాకు పడిన ఓట్లను కలిపితే కూడా ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి.దీంతో అభ్యర్థి విజయం తారుమారైంది. ఇలాంటి ఘటనలు చాలా నియోజకవర్గాల్లో జరిగినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు వాస్తవానికి ఓటమిపాలవ్వాల్సి ఉండగా అక్కడ వారు గెలిచారు.. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలవ్వాల్సి ఉండగా ఆ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ వారు గెలిచారు.
వాస్తవానికి కొప్పుల ఈశ్వర్ ఓడిపోయారా..?
ఉదాహరణకు ధర్మపురి నియోజకవర్గాన్ని తీసుకుంటే... ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం అక్కడ మొత్తం పోలైన ఓట్లు 1,65,209 ఓట్లు. ఆ నియోజకవర్గానికి బరిలో నిలిచిన 11 మంది అభ్యర్థులకు పోలైన ఓట్లు, నోటాకు పోలైన ఓట్లను కూడితే 1,65,747 ఓట్లుగా తేలింది. దీంతో అక్కడ తేడా 538 అదనంగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 441 ఓట్లతో గెలుపొందారు. వాస్తవానికి ఈ అదనపు ఓట్లతోనే ఆయన గెలిచినట్లు సమాచారం. ఒకవేళ ఈ పోలైన ఓట్లను తీసివేస్తే ఫలితం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్కు అనుకూలంగా మారేది. అంటే లక్ష్మణ్ కుమార్ గెలిచి ఉండేవారు.
చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం..?
ఇదిలా ఉంటే ఉన్న ఓట్లు కన్నా అధికంగా ఓట్లు ఎలా పోలయ్యాయనేదానిపై ఎన్నికల సంఘం సైలెంట్గా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ను ప్రశ్నించగా కొద్దిపాటి తేడా ఉంటాయని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఉన్న ఓట్లకంటే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు ఎలా పోలయ్యాయి అన్న ప్రశ్నకు రజత్ కుమార్ స్పందిస్తూ దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఆయన అన్నారు. ఇలా ఉన్న ఓట్లకంటే ఎక్కువ ఓట్లు పోలై ఉంటే ఫలితాల్లో చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలిచారో ఆ నియోజకవర్గాల్లో ఫలితం మారే అవకాశం ఉంది. గజ్వేల్ లాంటి నియోజకవర్గాల్లో భారీ విజయం అభ్యర్థి నమోదు చేయడంతో అక్కడ పెద్ద మార్పు ఉండదు కానీ... తక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి విషయంలో మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది.