తెలంగాణ కొత్త గవర్నర్గా సౌందర రాజన్, హిమాచల్కు దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం కొత్త గవర్నర్ను నియమించింది. ఈఎస్ఎల్ఎన్ నర్సింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇటీవలి వరకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్ను కేంద్రం నియమించింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమించింది.
హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న కల్రాజ్ మిశ్రాకు రాజస్థాన్ గవర్నర్గా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు కళ్యాణ్ సింగ్ రాజస్థాన్ ఇంఛార్జీ గవర్నర్గా కొనసాగారు. మహారాష్ట్రకు ఉత్తరాఖండ్ మాజీ సీఎం భగత్సింగ్ కోశ్యారిని, కేరళకు ఆరిఫ్ అహ్మద్ ఖాన్ను గవర్నర్లుగా పంపించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావును గత కొంత కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్గా నియమించింది.