దేశానికి ఆదర్శం, కాళేశ్వరంతో ప్రపంచం మనవైపు: గవర్నర్ తమిళిసాయి
హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ ప్రశంసించారు. సోవామవారం ఆమె తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బంగారు తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తమిళసాయి వ్యాఖ్యానించారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డ్ నెలకొల్పిందని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని గవర్నర్ ప్రశంసించారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన 30రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమమని కొనియాడారు.
దళితులు, బీసీలు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో గరిష్ట స్థాయిలో కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2018-19 సంవత్సరానికి గానూ తెలంగాణ 14శాతం వృద్ధి రేటు సాధించిందని గవర్నర్ తెలిపారు.