వామ్మో ఎంత నీచుడో.. మహిళలను ఫోటోలు తీస్తూ.. ఫోన్లో బంధిస్తూ..!
హైదరాబాద్ : మహిళలు అలర్ట్గా ఉండాల్సిందే. బయటకు వెళ్తే కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొందరు ఆకతాయిల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బయటపడ్డ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. వివిధ పనుల మీద బయటకొచ్చిన మహిళల ఫోటోలు తీస్తూ ఓ నీచుడు అడ్డంగా దొరికిపోయాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు వాడి ఫోన్లో పద్దెనిమిది వందల మంది మహిళల ఫోటోలు లభించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇంటి పనుల నిమిత్తం బయటకెళ్లే మహిళలు కాస్తా అజాగ్రత్తగా ఉంటే అది ఆకతాయిలకు వరంగా మారుతోంది. అసభ్య రీతిలో ఫోటోలు ఇస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఆ క్రమంలో తాజాగా వెలుగుచూసిన ఘటన విస్మయం కలిగిస్తోంది.
రెచ్చిపోతున్న ఆకతాయిలు.. కొన్ని ప్రాంతాల్లో నిత్యకృత్యం..!
ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పనీ, పాటా లేక విచ్చలవిడిగా తిరుగుతూ రోడ్లపై వెళ్లేవారిని ఇబ్బందులు పెడుతున్న ఘటనలు కొకొల్లలు. ఆ క్రమంలో మహిళలను సతాయిస్తున్న పోకిరీల బెడద నిత్యకృత్యంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో బయటికెళ్లి ఇంటికొచ్చే దాకా మహిళలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చౌరస్తాలు, సెంటర్లు, బస్స్టాపులు ఇలా ఎక్కడా చూసినా ఆకతాయిల బెడద తప్పడం లేదు.
ఇక కొందరైతే స్మార్ట్ఫోన్లతో అరాచకాలకు పాల్పడుతున్నారు. కెమెరాలు క్లిక్మనిపించి అసభ్యకర రీతిలో మహిళల ఫోటోలు తీస్తున్నారు. కొందరైతే నడుచుకుంటూ వెళుతున్న మహిళల వీడియోలు తీస్తూ పైశాచికానందం పొందుతున్నారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సైకోల్లా ప్రవర్తిస్తున్నారు. తీరా ఆ ఫోటోలు, వీడియోలు బాధితుల ఫోన్లకు చేరేవరకు ఆ విషయం బయటపడటం లేదు. కొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా.. మరికొందరు పోలీస్ స్టేషన్కు వెళ్లడం ఎందుకులే అనుకుంటూ తమలో తాము మధనపడుతున్నారు.
వైఎస్ జయంతి వేళ కొత్త చర్చ.. హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ లక్ష్మినారాయణ చెప్పిందేంటి?
మహిళల ఫోటోలు తీసిన కారు డ్రైవర్
తమిళనాడులోని నమక్కల్ జిల్లా మోహనూర్కు చెందిన 42 సంవత్సరాల అయ్యనార్ సొంత కారు అద్దెకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతని కూతురుకు పెళ్లి కూడా చేశాడు. అయితే వయసు పెరిగేకొద్దీ అతడి బుద్ధి హీనంగా మారింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళల్ని అసభ్యకర రీతిలో ఫోటోలు తీస్తూ పైశాచికానందం పొందుతున్నాడు.
అయితే శుక్రవారం (05.07.2019) నాడు సాయంత్రం వేళ మోహనూర్ బస్స్టాండ్లో జరిగిన ఘటన ఆ కామపిశాచి బండారం గుట్టురట్టు చేసింది. 27 సంవత్సరాల శక్తివేలు అనే యువకుడు తన భార్యతో కలిసి పని నిమిత్తం బయటకొచ్చాడు. ఆ క్రమంలో ఓ స్వీట్ హౌజ్ దగ్గర ఆగి స్నాక్స్ తీసుకున్నారు. ఆ సమయంలో తన భార్యను అయ్యనార్ ఫోటోలు తీస్తున్నాడనే విషయం గ్రహించాడు. దాంతో అతడిని నిలదీశాడు. అయితే స్వతహాగా కారు డ్రైవర్ అయిన అయ్యనార్ తనలోని రౌడీ బుద్ధి బయటపెట్టాడు. శక్తివేలుపై దాడి చేయడమే గాకుండా చంపుతానంటూ బెదిరించాడు.
బాధితుల ఫిర్యాదుతో గుట్టురట్టు..! ఫోన్ నిండా అవే ఫోటోలు
తన భార్యను ఫోటోలు తీయడమే గాకుండా.. పైగా చంపుతానంటూ బెదిరించడంతో శక్తివేలు పోలీసులను ఆశ్రయించాడు. మోహనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ క్రమంలో నిందితుడిని గుర్తించి ఆదివారం (07.07.2019) నాడు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
అయ్యనార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఫోన్లోని ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. అందులో 1800 మందికి పైగా మహిళల ఫోటోలు కనిపించాయి. కొన్ని అసభ్యకర రీతిలో చిత్రీకరించడం గమనార్హం. మోహనూర్ బస్స్టాండ్, బజారు వీధి తదితర ప్రాంతాల్లో ఆ ఫోటోలు తీసినట్లు గుర్తించారు పోలీసులు. మహిళల ఫోటోలు తీసిన కారు డ్రైవర్ అరెస్ట్ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. మహిళలు జాగ్రత్తగా ఉండి.. ఎవరైనా ఫోటోలు తీసినట్లు అనుమానమొస్తే వెంటనే నిలదీయడం ద్వారా తర్వాత జరిగే అనర్థాల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.