నిర్మలా సీతారామన్ గారూ! అప్పుడెందుకు మాట్లాడలేదమ్మా?: తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకవచన ప్రయోగం చేయడాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'నా ఆలోచన' ద్వారా స్పందించారు.
'నేను టీ అమ్ముకుని వచ్చాను. ప్రజల్లో నేను కూడా ఒకడిని.. ప్రజలతో ఉంటాను..' అని చెప్పిన మోడీని గౌరవించమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ప్రధానిని గౌరవించడమనేది ప్రతి పౌరుడి ధర్మం. అయితే మోడీగారి గురించి మాట్లాడింది ముఖ్యమంత్రిగారు మాత్రమే.. ప్రజలేమీ ఆయన్ని ఏకవచనంతో సంబోధించలేదు...' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
కడుపు మండి ఏదో అంటారు...
అంతేకాదు, ‘‘మీరేమైనా చేయొచ్చుగానీ, ఎదుటివాళ్లు ఏమీ అనకూడదా? అని బీజేపీని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కడుపు మండిపోతోంది. ఆ కడుపుమంట మీద మోడీని కేసీఆర్ ఏదో అంటే..‘ఏకవచన ప్రయోగం చేస్తారా? ' అంటూ నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తున్నారు! మరి ప్రజలు కూడా కడుపుమండి ఉన్నారు. రేపట్నించి వాళ్లు కూడా ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు... అప్పుడేమంటారు?'' అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.
అప్పుడు మీరెందుకు తప్పుబట్టలేదు?
‘గతంలో మా సినిమా వాళ్ల పెళ్లాలు ఎవరితోనో లేచిపోతారని మీ బీజేపీ ఎంపీ అన్న రోజున మీరెక్కడున్నారు? ఎందుకు స్పందించలేదు? అది మీకు తప్పుగా అనిపించలేదా? ప్రధానిని ఏకవచనంతో సంబోధించగానే మీరు మీడియా ముందుకొచ్చేశారు.. ఇది కరెక్టు కాదు..'' అని భరద్వాజ విమర్శించారు.
ప్రత్యేక హోదాపై మీరు మాట్లాడరేం?
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పి ఇప్పుడు మాట దాటవేస్తోందని, ఆ విషయం మీరు గమనించలేదా? అని తమ్మారెడ్డి భరద్వాజ రక్షణ మంత్రి నిర్మలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా చేస్తే కడుపు మండదా మరి? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా కడుపు మండి ఉన్నారు. ఆ కడపుమంటతో ప్రధాని మోడీనీ వాళ్లేదైనా అంటే దానికి ఎవరు బాధ్యులు? అని భరద్వాజ ప్రశ్నించారు.
‘పద్మావత్'పై అంత అల్లరి జరిగితే..
‘పద్మావత్' సినిమా వ్యవహారంలో నటి దీపికా పదుకొనేను చంపేస్తామని, ఆమె ముక్కు కోసెయ్యమని, ఆ సినిమా తీసిన డైరెక్టర్ ని చంపెయ్యమని, ఆయన తల నరికిచ్చిన వారికి రూ.5 కోట్లు ఇస్తామని మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నప్పుడు మీరెక్కడున్నారమా? ఇవన్నీ మీరూ విన్నవే కదా! మరి అప్పుడెందుకు మీరు మాట్లాడలేదమ్మా? అప్పుడు ఇవేవీ గుర్తు రాలేదా? మోడీ గారిని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మాత్రమే మీరు మీడియా ముందుకొస్తారా? అని భరద్వాజ ప్రశ్నించారు.
అన్నిటిపైనా మాట్లాడితే బాగుంటుంది...
మీరు అన్నీ తెలిసినవాళ్లు.. ప్రతిదీ మాట్లాడితే బాగుంటుంది. ఒక్క దానికి మాత్రమే పరిమితమవడం బాగుండలేదు. నాకు నచ్చ లేదు. నాకు అనిపించింది మీకు చెప్పాను. ఈ మాటలు మీ దాకా చేరితే సంతోషం.. వినండి' అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.