'ఉద్యమంలో కెసిఆర్ సక్సెస్.. పాలనలో ఫెయిల్', తెలంగాణకు అఖిలేష్ ప్రశంస
హైదరాబాద్/లక్నో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడారు. పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
ఉద్యమంలో కేసీఆర్ సక్సెస్ అయితే అయి ఉండవచ్చని, పాలనలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు. కార్మికులు, దళితులు, రైతులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వంపై పోరాడాలని వామపక్షాలు, సామాజిక శక్తులు నిర్ణయించాయన్నారు. రైతు రుణాల పైన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు.
తెలంగాణ సర్కార్ బాధ్యతగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. పత్తి మద్దతు ధర విషయంలో కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా గుజరాత్, మహారాష్ట్రలు రూ.500 రైతులకు ఇస్తున్నాయన్నారు. తెలంగాణ కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ విషయమై మాట్లాడుతూ.. ఆయనకు పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఆయన బిజెపిలోనే ఉన్నారన్నారు. క్వింటాల్ పత్తిని రూ.4100కు కొనుగోలు చేస్తున్నారన్నారు. హరీష్ రావు లేఖ రాసి కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు. పత్తి రైతులకు కేంద్రం ఐడీ కార్డులు ఇచ్చిందన్నారు.
తెలంగాణ సర్కారుకు అఖిలేష్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి సూచికగా అభివర్ణించిన తెలంగాణ సర్కారుకు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలహారం (వాటర్ గ్రిడ్) అంశంపై ఆయన మాట్లాడారు. ఈ పథకంపై సమగ్ర వివరాలతో తెలంగాణ అధికారులు తమకు ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు.
ఈ పథకం అద్భుతంగా ఉందని తమ రాష్ట్ర అధికారులు సైతం మెచ్చుకున్నరన్నారు. తమ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ లాంటి పథకాన్ని అమలుచేయడంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. గురువారం యూపీ రాజధాని లక్నోలో అఖిలేష్ను తెలంగాణ మంత్రి కెటిఆర్ కలిశారు.