టార్గెట్ 60 డేస్.. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు, మంచి వాతావరణం : కేసీఆర్
హైదరాబాద్ : దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరులకు నివాళులు అంటూ సీఎం కేసీఆర్ పంద్రాగస్టు ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. సమస్యల మూలాలను కనుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు విశేషంగా కృషి చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని స్పష్టంచేశారు సీఎం కేసీఆర్. పాలనలో జాఢ్యలకు తావులేదని తేల్చిచెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలను విభజించామని పేర్కొన్నారు. 10 జిల్లాలను 33గా చేశామని గుర్తుచేశారు. ఎన్నో ఎళ్లుగా తండాలు, గూడెలను పంచాయతీలు చేశామని తెలిపారు. కొత్త జోనవల్ వ్యవస్థతో నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అందిస్తామని నొక్కి వక్కానించారు.
టార్గెట్ 60 డేస్
60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలను సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ బల్బ్, తాగునీరు, శుభ్రంగా ఉంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రజల మౌలిక వసతులు కల్పిస్తామని భరోసానిచ్చారు. అలాగే నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. వేలాడుతున్న కరెంట్ వైర్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. కొన్నిచోట్ల మూడో వైర్ లేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సిబ్బంది వారం రోజులు గ్రామాలు, పట్టణాల్లో ఉంటారని చెప్పారు. సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
సతతం హరితం
పచ్చదనం పెంపొందించేందుకు కృషిచేయాలని కోరారు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదని .. మంచి వాతావరణం అని నొక్కి వక్కానించారు. మనం డబ్బులు పెట్టి ఏసీ, కూలర్ ఫ్రిజ్ కొనుగోలు చేయొచ్చని .. అలా వానలు కొనలేమని పేర్కొన్నారు. పల్లెలు ప్రగతి కేంద్రాలని .. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫించన్లు పెంచామని స్ఫష్టంచేశారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతబంధు, రైతు భీమా పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందన్నారు. వీటిని ఐక్యరాజ్యసమితి కూడా పొగిడిన విషయాన్ని ప్రస్తావించారు.
సంక్షేమ సర్కార్
రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణం మాఫీ చేస్తామన్నారు కేసీఆర్. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని .. దానిని మూడున్నరేళ్లలో పూర్తిచేసిన అధికారులు, ఇంజినీర్లను అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 400 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చని .. దీంతో సాగునీటి కష్టాలు తీరినట్టేనని పేర్కొన్నారు. కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్తరిస్తామని భరోసానిచ్చారు. ఇప్పుడున్న నీటికి అదనంగా గోదావరి నుంచి 575 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చన్నారు.
కొత్త రెవెన్యూ చట్టం
న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతానని పేర్కొన్నారు కేసీఆర్. సబ్బండ వర్గాల మేలు కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దృష్టి లోపాలను సవరించుకునేందుకు కంటి వెలుగు చేపట్టామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేస్తామని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశామని .. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్లో నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానని అని జై హింద్, జై తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.