టీఎస్లో బీజేపీ పట్టు బిగిస్తోందా....? రవిప్రకాశ్ ఎఫెక్టా..? మైహోమ్ పై ఐటీ దాడుల మర్మమేంటి..?
హైదరాబాదు: ఆయన తెలంగాణలో టాప్ ఇండస్ట్రియలిస్ట్. ఎంతటి నేతైనా సరే ఆయనముందు జీ హుజూర్ అనాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నితుడు. టీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా పెద్ద కొండ. ఎన్నో వ్యాపారాలు, తాజాగా మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. రాజకీయంగా కూడా పలు పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. ఆయన కోరుకుంటే దక్కనిది ఏదీ లేదు. ఏదైనా సరే ఒక రేటు కట్టి కొనగలిగే సత్తా ఉన్నవాడు. అలాంటి ఆయనపై ఆదాయపు పన్న శాఖ కన్నేసింది..? ఇంతకీ ఈ బడా పారిశ్రామికవేత్త ఎవరు..? ఆయనపై ఐటీశాఖ ఎందుకు దాడులు చేసింది..? ఇది రాజకీయ కక్షసాధింపా.. లేక ఎవరైనా ఫిర్యాదు చేశారా..?
రవిప్రకాష్ వర్సెస్ రామేశ్వర్ రావు
మైహోమ్ రామేశ్వరరావు...పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. తన సంస్థ పేరు తనకు ఇంటిపేరు అయ్యింది. అంతలా పాపులర్ అయ్యారు రామేశ్వరరావు. పట్టుకున్నదల్లా బంగారంగా మారింది. వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. దీంతో రాజకీయపరిచయాలు కూడా పెరిగిపోయాయి. ఎంతలా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడయ్యేవరకు. రామేశ్వరరావు అంటే సీఎం కేసీఆర్కు కూడా అపారమైన గౌరవం. ఈ మధ్యే మీడియా రంగంలోకి కూడా రామేశ్వర్ రావు ప్రవేశించారు. టీవీ9 ఛానెల్ను కొనుగోలు చేశారు. ఇక అప్పటి వరకు ఆ ఛానెల్కు సీఈఓగా వ్యవహరించిన రవిప్రకాష్ను ఒక్కసారిగా బయటకు పంపించేశారు. టీవీ9 సంస్థకు రవిప్రకాష్కు ఎలాంటి సంబంధం లేదని బయటప్రపంచానికి ప్రకటించారు. రవిప్రకాష్ పలు మోసాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. దీంతో రవిప్రకాష్కు పోలీసులు నోటీసులు పంపారు. ముందుగా కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ ఆ తర్వాత పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
రవి ప్రకాష్ రాసిన లేఖతోనే ఈడీ, ఐటీశాఖలు కదిలాయా...?
రవి ప్రకాష్ వర్సెస్ రామేశ్వర్రావుగా మొదైలన వార్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. గురువారం రోజున పారిశ్రామికవేత్త రామేశ్వర్రావు కార్యాలయంలోను ఆయన నివాసంలోనూ ఐటీ దాడులు జరిగాయి. అంతకుముందు రవిప్రకాష్ రామేశ్వర్రావు గుట్టు రట్టు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈడీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే రవిప్రకాష్ విడుదల చేసిన ఓ ఆడియోలో రామేశ్వర్ రావు తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేశారు. ఇక ఈడీకి ఐటీకి రామేశ్వరరావుపై ఫిర్యాదు చేయడంతో రెండు శాఖలు గురువారం కదిలాయి. హైటెక్ సిటీలోని రామేశ్వర్రావు కార్యాలయంతో పాటు నందగిరి హిల్స్లోని తన నివాసంపై కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
టీఆర్ఎస్ ఆర్థిక మూలాలపై కేంద్రం దృష్టి సారించిందా..?
ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ బీజేపీపై దూకుడుగా వ్యవహరించినందునే రవిప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా కేంద్రమే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన రామేశ్వర్ రావుపై దాడులు చేయించిందనే వార్త ప్రచారంలో ఉంది. సీఎం కేసీఆర్కు మీడియా పరంగానే కాకుండా ఆర్థికంగాను రామేశ్వర్రావు తోడ్పాటును అందిస్తున్నారు. ఇక తెలంగాణపై బీజేపీ కొంతకాలంగా దృష్టి సారిస్తోంది. తాజాగా నాలుగు లోక్సభ సీట్లు గెలవడంతో తెలంగాణ మీద కమలం పార్టీకి మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో భాగంగానే ముందుగా టీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వ్యక్తులు లేదా సంస్థల మూలాలపైన దృష్టి సారించినట్లు సమాచారం. అందులో భాగంగానే రామేశ్వర్ రావుపై దాడులు జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో భారీ ప్రాజెక్టులు దక్కించుకున్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థపైన ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అటు రామేశ్వర రావు ఇటు ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడంలో అటు కేంద్రానికి ఇటు ఐటీ ఈడీలకు రవిప్రకాష్ కావాల్సిన సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం మనసులో ఏముంది..?
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రామేశ్వర్రావు అంచలంచెలుగా పట్టుసాధిస్తూ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారారు. అటు రాజకీయం ఇటు మీడియా రంగాన్ని శాసిస్తున్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన రామేశ్వర్ రావును టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ను దెబ్బతీయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు బీజేపీ అంటే ఖాతరు చేయని కేసీఆర్ ఈ దాడులతో లొంగుతారా... రామేశ్వర్ రావు కోసం ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏంచేయబోతున్నారు..? రవిప్రకాష్కు రామేశ్వరరావు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు..? ప్రతి నిమిషం ఆసక్తితో గమనించాల్సిన అంశాలు ఇప్పుడు ఇవే.