టార్గెట్ మున్సిపోల్స్ .. అదును చూసి దెబ్బ కొట్టే ప్లాన్ లో సీఎం కేసీఆర్ !!
సీఎం కేసీఆర్ నెక్స్ట్ ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేశారు. నవంబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లనున్నామని హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రకటన చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం ఇచ్చిన జోష్ లో ఉన్న గులాబీ పార్టీ మునిసిపల్ ఎన్నికలకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
టెన్షన్ లో ప్రతిపక్షాలు .. మరో ఎన్నికలకు సిద్ధం అవుతున్న అధికార పార్టీ
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం నేపథ్యంలో గులాబీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నారు. ఇక ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తే ఉత్సాహంగా గులాబీ శ్రేణులు భాగస్వామ్యం తీసుకునేలా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంతో టెన్షన్ లో పడింది. ఇక బీజేపీ పరిస్థితి కూడా అదే. ఇక దీంతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళటానికి ఇదే రైట్ టైమ్ అని గులాబీ బాస్ భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితులు కలిసొచ్చే అంశం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇచ్చిన జోష్ తో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది టీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ లో టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత భుజాన వేసుకుని పని చేసినా ఫలితం రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక దెబ్బ నుండి కాంగ్రెస్ పార్టీ వెంటనే కోలుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. ఇక అంతే కాకుండా టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవసరం లేదంటూ సీనియర్లు పావులు కదుపుతున్న పరిస్థితి.
మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టటం కాంగ్రెస్ కు ఇప్పుడు కష్టమే
ఇక టీపీసీసీ చీఫ్ గా ఎవరికి అవకాశమిచ్చినా కాంగ్రెస్ పార్టీలో గొడవలు షరామామూలే. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉందని టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవకాశం ఇచ్చినా సరే మొదట నుండే వర్గ పోరుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత ఈజీగా సర్దుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాల నుండి కోలుకోవడానికి కాస్త టైం పట్టే అవకాశం వుంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టటం అంత ఈజీ టాస్క్ కాదు అన్నది గులాబీ బాస్ భావన.
నిరాశలో బీజేపీ ... జోష్ లో గులాబీ దండు
ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి చాలా కాలంగా కాస్త గట్టిగానే పనిచేస్తున్న బిజెపికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం అశనిపాతంగా మారింది. ఇక బీజేపీ కూడా ఈ నేపథ్యంలో కాస్త నిరాశకు గురవుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం టిఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఫలితమే ప్రతిబింబిస్తుంది అన్న భావన గులాబి బాస్ కేసీఆర్ కు ఉంది. అందుకే త్వరితగతిన మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
హుజూర్ నగర్ తీర్పే రాష్ట్రమంతా ..ఎన్నికలకు రైట్ టైమ్
నవంబర్ మాసం లోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలకు కెసిఆర్ సరైన సమయం చూసుకొని వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో నిరాశా నిస్పృహల్లో ప్రతిపక్షపార్టీలు ఉన్నప్పుడు, ఎన్నికలకు వెళ్లడానికి ఇదే అదను అని భావించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకుల భావన. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పడానికి వ్యూహాత్మకంగా టైం ఫిక్స్ చేసి సీఎం కేసీఆర్ టార్గెట్ మున్సి పోల్స్ అంటున్నారు.